దూకుడు వర్సెస్ మగధీర?
ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చి దూకుడు చిత్రం భారీ విజయం సాధించింది. ఈ ఘన విజయానికి రికార్డులను జత చేయటంతో 2009లో రాంచరణ్ తేజ హీరోగా వచ్చిన మగధీర రికార్డుల అంశం చర్చకు వచ్చింది. దీంతో ఇరువురు హీరోల అభిమానుల మధ్య మా హీరో గ్రేటంటే మా హీరో గ్రేటని రికార్డుల నివేదికలు ముందు పెడుతున్నారు. అభిమానుల మధ్య ఉద్వేగాలు ఏ స్థాయికి చేరాయంటే ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నాయి.
ఇంతవరకు ఏ సినిమా మగధీర రికార్డ్స్ అధిగమించలేదని, ఏ సినిమా అయిన అధిగమించిందని ఆయా ఏరియాలలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో నిరూపిస్తే రూ.2కోట్ల బహుమతి అని, ఎనభై ఏళ్ల సినీ చరిత్రలో వసూళ్లలో, 50 రోజుల కేంద్రాలలో, 100 రోజుల కేంద్రాలలో మగధీరే నెంబర్ వన్ అని, కొందరు సినిమా నిర్మాతలు అబద్దపు రికార్డులు ప్రకటించి సోదర భావంతో మెలుగుతున్న అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, మా హీరో రికార్డులను కరెక్టుగా ఏ సినిమానైనా అధిగమిస్తే స్వాగతిస్తామని, అదే రికార్డును మరలా మా మెగా హీరో సినిమాతో తప్పక అధిగమిస్తామని రాంచరణ్ తేజ అభిమానులు సవాల్ విసిరారు.
అందుకు మహేష్ అభిమానులూ స్పందించారు. సోదర భావంతో మెలుగుతున్న అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది ఎవరని, దూకుడు విజయోత్సవ వేడుక జరిగే ముందు ఫ్లెక్సీలు కట్టిందెవరని, ఇంతకుముందు రూ.58 కోట్ల షేర్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ అని ప్రకటించి ఇప్పుడు తిరగ రాశారని, పోకిరి రికార్డులు బద్దలు కొట్టినప్పుడు మేం స్వాగతించాం, ఇప్పుడు దూకుడు రికార్డులు అధిగమించినా స్వాగతిస్తామని ప్రతిస్పందించారు. రికార్డుల గొడవలు అభిమానుల మధ్య వైషమ్యాలకు దారి తీస్తోంది. ఇది ఒక్కోసారి శృతిమించుతోంది కూడా. ఎవరి రికార్డులు వారివే, ఎవరి అభిమానం వారిదే కానీ ఇలాంటి వాటి కోసం అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడం బాధాకరం.
రికార్డుల విషయానికొస్తే ఏ కాలానికి సమయానికి అదే గొప్ప. పావలా టిక్కెట్ ఉన్నప్పుడు దివంగత ఎన్టీఆర్ లవకుశ కోటి రూపాయలు వసూలు చేసిందట! అప్పటికి రాష్ట్ర జనాభా ఇప్పుడున్నంతలో సగం కూడా లేదు. అది మామూలు విషయం కాదు. అలాగే ఇటీవలి విషయానికొస్తే సమరసింహారెడ్డి, ఇంద్ర, ఆది, పోకిరి, మగధీర వేటికవే గ్రేట్.