చంద్రబాబుతో కేసీఆర్ పోటీ!: తెలంగాణకు 'హీరో'
హైదరాబాద్: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో.. తెలంగాణ రాష్ట్రంలో తమ పరిశ్రమను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరోలనే దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు కంపెనీ సీవోవో విక్రమ్ ఈ మేరకు హామీ ఇచ్చారు.
హీరో మోటోకార్ప్ సంస్థ తమ పరిశ్రమను దక్షఇణాదిన ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలను సంప్రదిస్తోందన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఈ సంస్థను సంప్రదించి.. అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే పరిశ్రమ ఏర్పాటు కోసం ఆ సంస్థను సంప్రదించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
దీంతో ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లి హీరో సంస్థ సీవోవో విక్రమ్ను కలిశారు. తమ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల పరిశ్రమను స్థాపించాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలోని వసతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణలో తమ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హీరో ప్రతినిధులు తెలిపారు. త్వరలో కేసీఆర్తో సమావేశమవుతామన్నారు. రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించే అవకాశముందు. వెయ్యి మందికి ఉపాధి లభించనుంది.
కాగా, ఈ ప్రాజెక్టు సాధన విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగి హీరో మోటో కార్ప్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి.. ఆంధ్రప్రదేశ్లో యూనిట్ ఏర్పాటు చేస్తే సకల సౌకర్యాలు కల్పిస్తామని.. పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నాల్లో భాగంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని రంగంలోకి దింపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆటోమొబైల్ బేస్ ఉన్న మెదక్తోపాటు రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడ యూనిట్ ఏర్పాటు చేసినా ప్రభుత్వం భూకేటాయింపులు చేయటంతో పాటు.. అన్ని రకాల రాయితీలు కల్పించటానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హీరో ప్రతినిధులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.