కిడ్నీ రాకెట్: వ్యవహారమంతా కొలంబోలోనే?
హైదరాబాద్: ఒక్క ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ నగర పోలీసులకు కిడ్నీ రాకెట్కు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. కిడ్నీ రాకెట్ ముఠాను ఒక్కదాన్ని పోలీసులు పట్టుకోవడంతో గుట్టు రట్టయింది. తాము పట్టుకున్న ముగ్గురిని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ శర్మ మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. దినేష్ అనే వ్యక్తి కొలంబోలో చనిపోయిన సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో వారికి నమ్మశక్యం కాని విషయాలు తెలిశాయి.
అనురాగ్ శర్మ అందించిన వివరాల ప్రకారం - నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన నూతి వెంకటేశ్వర్లు, గుంటూరుకు చెందిన డోగివర్తి షణ్మక పవన్ శ్రీనివాస్, విజయవాడకు చెందిన గోవింద్ సూర్యనారయణ అలియాస్ సూర్య ఫేస్బుక్, ఇంటర్నెట్ ద్వారా మూడేళ్ల క్రితం మిత్రులయ్యారు. నూతి వెంకటేశ్వర్లు మూడేళ్ల క్రితం ఇంటర్నెట్లో కిడ్నీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు తెలుసుకున్నాడు.
కొలంబోలోని మౌనిక్ వాటిని నిర్వహిస్తున్నట్లు గుర్తించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెంకటేశ్వర్లు కొలంబో వెళ్లి తన కిడ్నీని ఐదు లక్షల రూపాయలకు విక్రయించి వచ్చాడు. ఆ తర్వాత అతనే ఏజెంటుగా మారాడు. శ్రీనివాస్, సూర్యలను తనకు ఏజెంట్లుగా మార్చుకున్నాడు.
ఒక్కరిని పంపితే 50 వేల రూపాయలు వస్తాయని చెప్పడంతో వారిద్దరికి కూడా ఆశ పుట్టింది. ఇద్దరూ కొలంబో వెళ్లి, మౌనిక్ను కలుసుకున్నారు. తిరిగి వచ్చి ఇంటర్నెట్, ఫేస్బుక్ల్లో యువకులను ఆకర్షించడం ప్రారంభించారు. కిడ్నీలు ఇచ్చి వచ్చినవారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను శ్రీనివాస్ తీసుకోగా, ఎవరైనా అధికంగా డబ్బు డిమాండ్ చేస్తే సర్దిచెప్పడం, అవసరమైతే మీడియా పోలీసు పేరు చెప్పి బెదిరించడం సూర్య పని.
నిందితుల్లో ఒక్కడైన వెంకటేశ్వర్లు గుంటూరుకు చెందిన కిరణ్, దినేష్లతో కలిసి ఉత్తర భారతదేశానికి చెందిన ఆరామ్ జాగర్తో గత నెల 23వతేదీన కొలంబో చేరుకున్నాడు. కిరణ్కు మార్చి 29వ తేదీన, దినేష్కు ఏప్రిల్ 1వ తేదీన మూత్రపిండాలు మార్పిడి చేసే ఏర్పాటు చేశారు. ఈలోగా కిరణ్, దినేష్ ఆరామ్ జాగర్ కలిసి మార్చి 28న కొలంబో బీచ్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు.
వడదెబ్బకు దినేష్ వాంతులు చేసుకుని, బీచ్లో పడిపోయాడు. దీంతో వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చారు. దినేష్ను వెంకటేశ్వర్లు అస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తేల్చారు
విషయాన్ని మౌనిక్కు వెంకటేశ్వర్లు చెప్పాడు. దాంతో మౌనిక్ వైద్యులకు ఫోన్ చేసి, ఉద్యోగం కోసం వచ్చాడని సర్ది చెప్పాడు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు దినేష్ సోదరుడు గణేష్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దాంతో దినేష్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ కలెక్టర్ మీనాను కలిశారు. ఆయన కొలంబోలోని భారత హై కమిషనర్ను సంప్రదించారు. ఈ నెల 3వ తేదీన దినేష్ మృతదేహం దేశానికి వచ్చింది.
దినేష్ అంత్యక్రియలు ఈ నెల 3వ తేదీన జరిగాయి. వారికి అనుమానం వచ్చి దినేష్ ఈమెయిల్, ఫేస్బుక్ ఖాతాలను చూశారు. దాంతో వారికి కిడ్నీ రాకెట్ విషయం తెలిసిందే. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూత్ర పిండం ఇచ్చినందుకు తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 3.90 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని బాధితుడు కిరణ్ చెప్పాడు. మొత్తం మీద, దినేష్ మరణంతో కిడ్నా రాకెట్ ముఠా గుట్టు బయటపడింది.