పోలీస్ ఆపరేషన్: సూరారాన్ని చుట్టుముట్టి (పిక్చర్స్)
హైదరాబాద్: సూరారం కాలనీలో పోలీసులు దాడులు నిర్వహించారు, గాలింపు చర్యలు చేపట్టారు. నక్సలైట్ల కోసం వేట సాగించినట్లుగా సైబరాబాద్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నిఘా విభాగం సమాచారం మేరకు పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల నేరగాళ్లకు నిలయాలుగా మారిన 12 ప్రాంతాలను గుర్తించారు.
ఆ ప్రాంతాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఆ ప్రాంతాల్లోకి ఉగ్రవాదులూ తీవ్రవాదులు చొరబడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి 200 మంది పోలీసులు సూరారం కాలనీని చూట్టుముట్టారు. అదనపు డిసిపి, ముగ్గురు ఎసిపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్స్పెక్టర్లు సూరారం కాలనీలో గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రధానంగా పారిశ్రామిక వాడలు నేరగాళ్లకు అడ్డాలుగా మారాయనే భావన నెలకొని ఉంది. ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు కూడా ఉంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా ఆశ్రయం తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు.
సూరారం కాలనీని చుట్టుముట్టి..
పోలీసులు సూరారం కాలనీని చుట్టుముట్టి సోదాలు నిర్వహించారు. నేరగాళ్లకు అడ్డాగా మారిందనే అనుమానంతో వారు ఈ పనికి పూనుకున్నారు.
అదుపులోకి అనుమానితులు
23 మంది అనుమానితులను అదుపులోకీ తీసుకున్నారు. వాళ్లు ప్రధానంగా దొంగలు, రౌడీ షీటర్లు. 20 బైకులను, పది త్రీవీలర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని దొంగిలించి తీసుకుని వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నగర శివార్లపై నజర్
హైదరాబాద్ నగర శివార్లను సురక్షిత ప్రాంతాలుగా మార్చడానికి మరో 20 రోజుల పాటు ఇటువంటి దాడులు జరుగుతాయని సైబరాబాద్ క్రైమ్ అదునపు డిసిపి జానకి షర్మిల చెప్పారు.
అదే రీతిలో
నక్సలైట్ల గాలింపు కోసం చేపట్టే ఆపరేషన్ మాదిరిగా హైదరాబాదు శివార్లలోని బస్తీల్లో ఆపరేషన్ సాగుతుంది. ఈ ప్రాంతాలను మూడు లేయర్లుగా విభజిస్తారు. మూడు వరుసల్లో పోలీసులు కాపు కాస్తారు. దీంతో గాలింపు జరుపుతున్నప్పుడు ఎవరూ పారిపోవడానికి వీలుండదు.
డిజిటల్ మ్యాప్ వాడకం
బస్తీల్లో పోలీసులను తగిన విధంగా దించడానికి పోలీసులు డిజిటల్ మ్యాప్ను వాడుతారు. సూరారం కాలనీలో వేట సాగించి వంద మంది నేరగాళ్లు ఈ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించారు
సివి ఆనంద్ ఆపరేషన్
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
నేరాస్థులకు అడ్డాగా..
పోలీసులకు టోకరా ఇచ్చి వారు పారిపోతున్నారని జానకి షర్మిల అన్నారు. ఈ ప్రాంతాల్లో నిఘాను పెంచుతున్నట్లు తెలిపారు.