హడావుడి వద్దు: టీలో 19న సర్వే, ఫార్మాట్ ఇదే...
హైదరాబాద్: కుటుంబ సమగ్ర సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, ఆర్థిక సర్వే దృష్ట్యా 19న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. సెలవును ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైలు పైన శనివారం సంతకం చేశారు. వేతనంతో కూడిన సెలవుదినంగా దానిని ప్రభుత్వం అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లిన ఎన్యుమరేటర్లు... ఇంటికి తాళం వేసి ఉంటే పక్కింటి వారిని అడిగి ఆ కుటుంభ యజమాని పేరు మాత్రమే రాయాలని, ఇతర వివరాలు నమోదు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. సమయం మించిపోతుందని హడావుడిగా రాయవద్దని, ప్రతి కుటుంబానికి కావాల్సినంత సమయం ఇచ్చి వివరాలు రాసుకోవాలని పేర్కొంది. సొంతగా ఏమీ రాయవద్దని స్పష్టం చేసింది.
నమోదు చేయాల్సిన వివరాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వివరాల సేకరణలో ఎన్యుమరేటర్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నమోదు విధివిధానాలు పేర్కొంటూ ఫార్మాట్ ఫాం సిద్ధం చేసింది. ఇందులో ఏయే ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరో కూడా వివరించింది. ఫార్మాట్ను నెట్లో పెట్టారు.
ప్రశ్నలు అడిగ కేవలం వారి చెప్పింది మాత్రమే రాసుకోకుండా.. ఇంట్లో పరిస్థితిని గమనించి, వారితో చర్చించి వాస్తవ సమాచారం రాయాలి. ఒక ఇంట్లో తల్లిదండ్రులతో పాటు వివాహమైన జంటలు ఎక్కువగా ఉన్నా.. ఒకే కుటుంబంగా కలిసి ఉంటే ఒక ఫార్మాట్లోనే వివరాలు రాయాలి. కొన్ని ఇళ్లలో అన్నదమ్ములు వేర్వేరుగా నివసిస్తుంటే వేర్వేరుగా నమోదు చేయాలి. కుటుంబ సభ్యులు ఏ మతానికి చెందిన వారమని చెప్తే ఆ మతం కోడ్ రాయాలి. సామాజిక వర్గం కూడా అలాగే రాయాలి.
కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే భాషనే మాతృభాషగా రాయాలి. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి వివరాలు రాయాలి. కొందరు వేరే ప్రాంతాల నుండి వచ్చి కొన్ని రోజులు ఉండటానికి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా.. ప్లాస్టిక్ షీట్ పైకపప్పుతో గానీ, వేరే ఇతర పైకప్పులతో గానీ గూడు ఏర్పాటు చేసుకుంటారు. వీరి నివాస స్థితిని నమోదు చేయాలి. వంట గది మినహా ఇంట్లో ఉన్న గదుల సంఖ్యను రాయాలి. ఇంకా ఇళ్లు ఉన్నా, ఇళ్లు ప్రభుత్వం నుండి పొందినా రాయాలి.
విద్యార్థులు చదువు కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నా వారి వివరాలు రాయిలి. యజమాని కుమారుల కుటుంబాలు ఉద్యోగరీత్యా పట్టణంలో నివసిస్తుంటే మాత్రం వారి వివరాలు రాయవద్దు. 6-14 సంవత్సరాల లోపు పిల్లలు బడికి వెళ్తున్నారో లేదో తెలుసుకోవాలి. ఉద్యోగ వివరాలు తెలుసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు, ప్రయివేటు ఉద్యోగాలు చేస్తూ నెల జీతం తీసుకునే వారికి మాత్రమే ఉద్యోగం ఉందని నమోదు చేయాలి. వారి ఖాతాల వివరాలు, ఆధార్ వివరాలు రాయాలి.