సిటీ ఆఫ్ పొలిటికల్ మాఫియా
దేశ స్వాతంత్ర్యోద్యమానికి విజయవాడ ప్రధాన కేంద్రంగా ఉంటూ వచ్చింది. రాష్ట్ర రాజకీయ రాజధానిగా కూడా దానికి పేరుంది. ఎందరో మహామహులు ఈ నగరంలో పుట్టారు. కమ్యూనిస్టు, కాంగ్రెసు పార్టీలు సమపాళ్లలో ఉండేవి. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత గ్రూపు వైరాలకు విజయవాడ కేంద్రంగా మారింది. చలసాని వెంకటర్నం, ఆయన శిష్యుడు వంగవీటి రాధాకృష్ణ మధ్య వైరం విజయవాడలో గ్రూపు రాజకీయాలకు, హత్యలకు, ప్రతీకారాలకు పునాది ఏర్పడింది. 1972 ప్రాంతంలో వెంకటరత్నం ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు రాధాకృష్ణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత వంగవీటి రంగా తెర మీదికి వచ్చారు. రంగా ప్రవేశంతో విజయవాడ గ్రూపు వైరాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. దానికి కులం కూడా తోడైంది. రెండు కులాల మధ్య భౌతిక దాడులు, పరస్పర హత్యలకు ఉదాహరణగా నిలిచాయి.
రంగాతో 1979 ప్రాంతంలో దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ రంగా నుంచి విడిపోయారు. దాంతో రంగా, దేవినేని కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దేవినేని గాంధీ హత్యతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత 1988లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో వంగవీటి రంగా హత్య రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమైంది. దేవినేని సోదరుడు మురళి కూడా హత్యకు గురయ్యాడు. ఇలా హత్యలు, ప్రతీకార హత్యలతో విజయవాడ రగిలిపోతూ వచ్చింది. 1996 నుంచి ఈ ఉద్రిక్తతలు కాస్తా తగ్గాయి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ, కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ, దేవినేని నెహ్రూ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తాజాగా, పండు హత్య మళ్లీ విజయవాడలో అగ్నిని రాజేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ రాజకీయాలు భూవివాదాల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూడా పాకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.