అప్పుడు చిరంజీవి, ఇప్పుడు తెలంగాణ!

ఆదివారం, ఫిబ్రవరి 5, 2012, 11:49 [IST]
Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణ కోసం అధిష్టానం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కిరణ్ మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు వినవస్తున్న నేపథ్యంలో అలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే అధిష్టానం కేవలం తెలంగాణ వారితో మాత్రమే విస్తరణ చేసుకోవాలని సిఎంకు అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శంకర రావు వివిధ కారణాలతో మంత్రి వర్గం నుండి బయటకు వెళ్లారు. ఆ స్థానాలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణకూ న్యాయం చేస్తున్నామన్న భావన కల్పించేందుకు అదే ప్రాంతం నుండి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకునేందుకు అనుమతిచ్చినట్లు సమాచారం. అంతకుమించి ప్లస్‌లు, మైనస్‌లకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటీవల కేవలం చిరంజీవి వర్గానికి అనుమతిచ్చిన అధిష్టానం తాజాగా తెలంగాణ నేతలను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అనుమతించడం గమనార్హం.

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తోనూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ కిరణ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కూడా శనివారం బాగా పొద్దుపోయాక కిరణ్ భేటీ అయ్యారు. కేబినెట్‌లో ఖాళీ అయిన తెలంగాణ స్థానాలనైనా భర్తీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయన్న కిరణ్ వాదనతో అధిష్ఠానం ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల భర్తీ కోసం మాత్రమే విస్తరణ చేపట్టాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13 నుంచి జరుగుతున్నందువల్ల ఈనెల 6 లేదా 9న విస్తరణ జరగవచ్చునని తెలుస్తోంది. గండ్ర వెంకటరమణా రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వికారాబాద్‌కు చెందిన ప్రసాదరావు లేదా భట్టి విక్రమార్కలకు పదవులు దక్కే అవకాశాలున్నాయి. అధిష్ఠానంతో చర్చల సందర్భంగా సిఎం కిరణ్ పలు అంశాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

రాజీవ్ యువకిరణాలు పథకం వివాదాస్పదం కావడం, సమాచార కమిషన్‌లో సభ్యులను నియమించిన తీరుతో పాటు ఐఏఎస్ అధికారుల నిరసన గురించి కూడా సీఎం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆజాద్‌తో రెండు గంటలు చర్చించినప్పటికీ సోనియా గాంధీ వరకు వచ్చేసరికి సిఎం సమావేశం ఐదు నిమిషాలకే పరిమితం అయింది. కిరణ్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళుతున్నారు. కాగా, ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ కూడా సిఎంతో సమావేశమయ్యారు. ఐఏఎస్ అధికారుల నిరసన గురించి కూడా వీరు చర్చించినట్లు తెలిసింది.
English summary
It seems, Congress Party high command gave green signal to CM Kiran Kumar Reddy to cabinet expansion with Telangana leaders.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
IPL, Wankhede Stadium, Mumbai
Kolkata Knight Riders won by 32 runs
1st Test , Lord's Cricket Ground, St John's Wood
Match starts at 03:30 pm IST  
IPL, Himachal Pradesh Cricket Association Stadium, Dharmasala
Match starts at 04:00 pm IST