బాబుకు రాజధాని తలనొప్పి: తెరపైకి శ్రీబాగ్
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలును రాజధానిగా చేయాలనే డిమాండ్ రాయలసీమలో జోరు పెరుగుతోంది. విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పానికి మద్దతుగా నిలిచిన రాయలసీమ నేతలు, కొత్త రాష్ట్రంలో ప్రాధాన్యతలన్నీ కోస్తాంధ్రకే దక్కుతున్నాయనే ఆవేదనను బలంగా వినిపిస్తున్నారు. దీంతో కనీసం రాజధానినైనా సాధించుకోవాలనే తపన పెరుగుతోంది. ఇందుకు శ్రీబాగ్ ఒడంబడికను తెర మీదికి తెస్తున్నారు.
రాష్ట్ర రాజధానిని కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. దానికి రాయలసీమ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి విరుగుడు అన్నట్లుగా మంత్రి పరిటాల సునీత రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ విషయంలో రాయలసీమ మేధావులు, రచయితలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అక్కడి మేధావులు, రచయితలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగారాజధాని విషయంలో రాయలసీమలోని ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రతిరోజూ సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇందులో మేధావులు, ప్రముఖ నేతలు పాలుపంచుకుంటున్నారు.
1937 నవంబర్ 16న జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీమంత్రి ఎంవి మైసూరారెడ్డి రాజధానికి ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూనే కర్నూలు రాజధానిని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నేపథ్యంలో రాజధానిని వదులుకున్న కర్నూలు జిల్లా ప్రజలు, ఇప్పుడు ఆ అవకాశాన్ని దక్కించుకోవాలనే తపనతో ఉండటం తప్పులేదంటూ రాయలసీమవాసుల డిమాండ్ను సెంటిమెంట్కు అనుసంధానం చేశారు.
పైగా 50 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలనే నియమం పెట్టుకుంటే 55 వేల ఎకరాలు అందుబాటులో ఉన్న కర్నూలులో రాజధాని ఏర్పాటు సులభమవుతుందనే భావనతోనే ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు. గతంలో ఆయన వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి పెద్దఎత్తున పోరాటం చేశారు. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ సీమలోని వెనుకబాటుతనాన్ని గుర్తించి తన నివేదికలో పొందుపరిచింది.
తుంగభద్ర నీటిని కృష్ణానదికి అనుసంధానం చేయడం వల్ల రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు తాగునీటికి సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. వరద నీటితో కలిపి దాదాపు 300 టిఎంసిల నీరు కృష్ణా నది మీదుగా సముద్రం పాలవుతోంది. సహజ వనరులకు కొదవలేని రాయలసీమలో అవి సద్వినియోగం కాక అభివృద్ధికి నోచుకోవడం లేదని సీమ అభివృద్ధి కోసం పోరాడుతున్న నేతలు అభిప్రాయ పడుతున్నారు.
గతంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు, ప్రత్యేక వర్శిటీ, నిరుద్యోగులకు శాశ్వత ఉపాధి కోసం భారీ పరిశ్రమ ఏర్పాటు చేయడంతోపాటు నీటిపారుదలకు సంబంధించి ప్రాధాన్యతనిస్తూ కృష్ణా మిగులు జలాలు శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ద్వారా సీమవాసులకు అందించాలని చేసిన శ్రీబాగ్ ఒప్పందంలోని ప్రధాన అంశాలకు ఇప్పటి వరకు అతీగతీ లేదని రాయలసీమ రాజధాని పోరాట కమిటీ గుర్తు చేస్తోంది.
విభజన తరువాత పరిణామాల్లో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్, ట్రిపుల్ ఐటి, నీట్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన మరో ఆరు విద్యాసంస్థలు కోస్తా జిల్లాలకే కేటాయించడంతోపాటు రాజధానిని కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాన్ని ఎంచుకోవడంపై రాయలసీమ నేతలు అసంతృప్తితో ఉన్నారు.