బాబుకు ఝలక్: తెరాసలోకి తుమ్మల, వేనేపల్లి?
ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వర రావు సహా పలువురు టిడిపి నాయకులు తెరాసలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి రావాలని కెసిఆర్ చాలా కాలంగా తుమ్మల నాగేశ్వర రావును కోరుతున్నారు. 2014 ఎన్నికల సందర్భంలో తెరాస నేతలు కెటి రామారావు, హరీష్ రావు పలుమార్లు తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడారు. కానీ తుమ్మల తాత్సారం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు ఆయన తన మనసు మార్చుకుని తెరాసలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇటీవల తుమ్మల నాగేశ్వర రావుతో కెసిఆర్ భేటీ అయ్యారు. సోమవారం ఓ ప్రముఖ వ్యాపారవేత్త నివాసంలో వారిరువురి మధ్య భేటీ జరిగినట్లు, తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తుమ్మల నాగేశ్వర రావు కెసిఆర్తో చెప్పినట్లు సమాచారం.
కాగా, నల్లగొండ జిల్లా కోదాడ మాజీ శాసనసభ్యుడు వేనేపల్లి చందర్ రావు తెరాసలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన మంగళవారంనాడు కెసిఆర్తో సమావేశమయ్యారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు మూకుమ్మడిగా తెరాసలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా నేతల చేరిక కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా హైదరాబాదులో పెట్టాలని తెరాస నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులతో పలువురితో పాటు కొంత మంది సిట్టింగ్ శాసనసభ్యులు కూడా తెరాసలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మూకుమ్మడిగా వివిధ పార్టీల నాయకులను, శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని కార్యక్రమానికి కెసిఆర్ శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.