జోరు: పవన్, కృష్ణయ్యలతో బాబు పాంచ్ పటాకా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైన అన్నింటిని ఉపయోగించుకుంటున్నారు. బిసి నేత ఆర్ కృష్ణయ్యను అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. చాలా ఏళ్లుగా ఆర్ కృష్ణయ్య బిసిల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం కలిసి వస్తుందని భావిస్తున్నారు.
అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ప్రచారానికి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలో పవన్తో ప్రచారం చేయించనున్నారట. బుధవారం పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తరఫున మల్కాజిగిరిలో ప్రచారం చేయకుండా చేయడంలో విజయవంతమయ్యారు. మరోవైపు దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తుతో ఆ క్యాడర్... దానికి తోడు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కలిసి వస్తుందని బాబు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో టిడిపికి ఉన్న క్యాడర్ తమతోనే ఉంటుందని.. తద్వారా సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతంలోని సైకిల్ జోరు తప్పదని ధీమాతో ఉన్నారు. పవన్ మద్దతు, ఆర్ కృష్ణయ్య అభ్యర్థిత్వం, బిజెపి-మోడీ గాలి, దళిత ఉప ముఖ్యమంత్రి, పార్టీ క్యాడర్.. ఇవన్నీ టిడిపికి విజయాన్ని తెచ్చి పెడతాయంటున్నారు.
పవన్ కళ్యాణ్
తెలంగాణలో మరో ఆరు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో బుధవారం పవన్తో చంద్రబాబు భేటీ అయి ఆయన మద్దతు తనకేనని చెప్పించడం గమనార్హం. టిడిపి, బిజెపి తరఫున తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆయనను ఒప్పించారట.
ఆర్ కృష్ణయ్య
ఆ తర్వాత బుధవారం సాయంత్రం ఆర్ కృష్ణయ్యను సిఎం అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తద్వారా సామాజిక తెలంగాణ నినాదానికి ఊపుతెచ్చారు.
నరేంద్ర మోడీ
తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రచార సభల తర్వాత ఎన్డీయే కూటమి మరింత దూసుకెళ్లడానికి ఈ పరిణామాలు ఉపయోగపడతాయని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. టిడిపి, బిజెపి కూటమి తరపున తెలంగాణలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని పవన్ నిర్ణయించారు. మోడీ కూడా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు
ఆర్ కృష్ణయ్యతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశముంది. శుక్రవారం నుంచి ఈ ప్రచార సభలు మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణవ్యాప్తంగా 45 చోట్ల పవన్ సభలు నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. టిడిపి, బిజెపి అభ్యర్థులు పోటీ చేసే నియోజక వర్గాల్లో వీటిని నిర్వహిస్తారు. ఇందుకు ఇప్పటికే టిడిపి అంతర్గతంగా కసరత్తు మొదలు పెట్టింది.
చంద్రబాబు నాయుడు
తెలంగాణ ఎన్నికల రణరంగం ఆఖరి దశలో తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేయడానికి టిడిపి వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ తరపున అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విడతల వారీగా ప్రచారం చేస్తున్నారు.
నారా లోకేష్
బుధవారం ఆదిలాబాద్లో చంద్రబాబు, నిజామాబాద్లో లోకేశ్ ప్రచారం చేశారు. గురువారం చంద్రబాబు ఖమ్మంలో, లోకేశ్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణలో ఇప్పుడు తమకు తోడుగా పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించుతున్నారు. ఈ నెల 28వ తేదీతో తెలంగాణలో ప్రచారం ముగుస్తుండటంతో చంద్రబాబు పూర్తిగా ఇక్కడే దృష్టి కేంద్రీకరించనున్నారు.
బాలకృష్ణ
సీమాంధ్రలో విరామం వచ్చినట్లు ఉండకూడదన్న ఉద్దేశంతో రెండు రోజుల తర్వాత నారగా లోకేశ్ అక్కడికి వెళతారు. అక్కడ ఇప్పటికే హీరో బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు.