తెలంగాణ నేతలకు అమిత్ షా డైరెక్షన్ (ఫొటోలు)
హైదరాబాద్: తన హైదరాబాద్ పర్యటనలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీ తెలంగాణ నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కునే బలమైన శక్తిగా రూపొందించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించి అమలు చేయాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదని చింతించదవద్దని, కేంద్రంలో అధికారంలో ఉంది మనమేనని చెబుతూ తెలంగాణలో బలం పుంజుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో పార్టీ ఇప్పటికే గ్రామ స్థాయి వరకూ వెళ్లిందని, దాన్ని బూత్ స్థాయి వరకూ తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని హితవు చెప్పారు.
తెలంగాణలోని పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులతో అమిత్ షా ముఖాముఖీ కార్యక్రమం శుక్రవారం సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొంత మంది గ్రామ కమిటీ అధ్యక్షులతో మాట్లాడించారు. ఆయా గ్రామాల్లో, బూత్ల స్థాయిలో పార్టీ ఎలా బలంగా ఉందో వారు వివరించారు.
యుపిలో చూపించా..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇన్చార్జిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో 73 ఎంపీ స్థానాలు గెలిచామని, కానీ ఆ విజయం కన్నా తెలంగాణలో పార్టీ 23 శాతం ఓట్లు సంపాదించిందన్న వార్త వినగానే సంతోషమేసిందని అమిత్ షా అన్నారు.
చిన్న విషయం కాదు..
తెలంగాణలో అన్ని ఓట్లు సాధించడం చిన్న విషయం కాదని, తెలంగాణ కోసం బిజెపి కార్యకర్తలు చాలా కష్టపడ్డారని, ఎన్నో రకాలుగా ఉద్యమించారని, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సందర్భంగా రాజకీయం చేసిందని అమిత్ షా అన్నారు.
విద్వేషాలు రగిల్చింది...
కాంగ్రెసు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చిందని, కానీ బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇరు వైపులా మిఠాయిలు పంచుకున్నారని అమిత్ షా అన్నారు.
అమరవీరులకు శ్రద్ధాంజలి
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, వారి కుటుంబాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాని అమిత్ షా అన్నారు.
క్రెడిట్ కిషన్ రెడ్డికి..
ఇప్పటికే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి రాసిన లేఖకు మోడీ స్పందించి తెలంగాణకు అనుబంధ బడ్జెట్లో ఎయిమ్స్ను మంజూరు చేశారని, హార్టీకల్చర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీలను కూడా మంజూరు చేశారని అమిత్ షా చెప్పారు.
గ్రామాల దాకా తీసుకుని వెళ్లాలి.
బహుశా దేశంలోని తెలంగాణకు మంజూరు చేసింది మొదటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చునని, అందుకే మున్ముందు కార్యకర్తలు ఈ విషయాలను గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లాలలని ఆయన అన్నారు.
తెలంగాణలో బలపడాలి..
పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తూర్పు, దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో పార్టీ బలపడాలని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా అన్నారు.
హితోపదేశం..
గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల మాదిరిగా పార్టీ పటిష్ఠం కావాలని, మీరు బలపడి, నరేంద్ర మోడీకి చేదోడువాదోడుగా నిలబడాలని ఆయన పార్టీ గ్రామాధ్యక్షులతో అన్నారు.
నమ్మకం ఉంది..
కచ్చితంగా తెలంగాణలో పార్టీ బలపడుతుందన్న నమ్మకం తనకు ఉందని, వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసు నష్టం చేసింది..
కాంగ్రెస్ పార్టీ రైతులకు నష్టం చేసేలా డబ్ల్యూటీవో ఒప్పందానికి అంగీకరించిందని, కానీ అది రైతులకు నష్టదాయకమని భావించిన బీజేపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందని అమిత్ షా గుర్తుచేశారు
తెలంగాణ బిజెపి వెబ్సైట్
తెలంగాణ బిజెపి వెబ్సైట్ను అమిత్ షా ప్రారంభించారు. నేరుగా పార్టీ గ్రామాధ్యక్షులతో మాట్లాడారు. వారి చేత ముందు మాట్లాడించి, ఆ తర్వాత వారికి అమిత్ షా మార్గోపదేశం చేశారు.
సాంస్కృతి కార్యక్రమాలు..
అమిత్ షా సమావేశం సందర్భంగా ఆయన రావడానికి ముందు సాంస్కృతి కార్యక్రమాలు కూడా జరిగాయి.