కెసిఆర్కు విద్యార్థుల సెగ: ఒయుకు దడి (పిక్చర్స్)
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయానికి విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వారిని క్రమబద్దీకరస్తే తమకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వారు ఆందోళన సాగిస్తున్నారు. ఈ స్థితిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ మరోసారి పోలీసులు దడి కట్టారు. విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తామని అంటున్నారు.
యూనివర్సిటీ విద్యార్థులు సాగిస్తున్న ఆందోళనకు అండగా నిలవాలా? వద్దా అనే విషయంపై రాజకీయ పక్షాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. విద్యార్థుల ఉద్యమంలో న్యాయం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. అయితే, అదే పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు మద్దతు ఇచ్చే ముందు మరోసారి ఆలోచించాలని సూచించారు.
ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో విద్యార్థులు ఆందోళన చేస్తే మద్దతివ్వడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదని, కానీ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటే వద్దని ఎలా డిమాండ్ చేయగలమని, అందుకే ఆలోచిస్తున్నామని తెలుగుదేశం నేతలు అంటున్నారు.
తెలంగాణలో శ్రమ దోపిడీ ఉండదని, కాంట్రాక్టు ఉద్యోగులు అనేవారు ఉండరని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేర్చారు.
మధ్యేమార్గంగా కనీసం మూడేళ్లకాలం పని చేసి, తగిన అర్హతలు ఉన్నవారి సర్వీసునే క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనను కొందరు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్దఎత్తున ఖాళీలు ఉన్నాయని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కాగానే ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రులు చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను కూడా విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. మంత్రులను అడ్డుకోవడం తగదని, త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
క్రమబద్దీకరణ వివాదం
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే నిర్ణయంపై ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు మంత్రులను సైతం అడ్డుకుంటున్నారు.
క్రమబద్దీకరణ వివాదం
పోలీసులు లాఠీచార్జీ చేయడంతో విద్యార్థులు సోమవారం చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.
క్రమబద్దీకరణ వివాదం
హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే విద్యార్థి ప్రతినిధులు హాలులోకి వచ్చి తమ వాదన వినిపించారు.
క్రమవద్దీకరణ వివాదం
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంలో ప్రధానంగా కాలేజీల్లో లెక్చరర్ల నియామకం విషయంలోనే విద్యార్థులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
క్రమబద్దీకరణ వివాదం
రిజర్వేషన్లు, నియమ నిబంధనలు ఏమీ పాటించకుండా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారని, ఇప్పుడు వారిని ఎలా క్రమబద్ధీకరిస్తారని విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు.
క్రమబద్దీకరణ వివాదం
కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లను ఇష్టం వచ్చినట్టు నియమించుకున్నారనేది విద్యార్థుల విమర్శ. ప్రతిభావంతులైన విద్యార్థులు లెక్చరర్ పోస్టుల కోసం అన్ని పరీక్షలకు సిద్ధమవుతుంటే, కాంట్రాక్టు లెక్చరర్లతో వాటిని ఎలా భర్తీ చేస్తారనేది విద్యార్థుల వాదన.
క్రమబద్దీకరణ వివాదం
ఉస్మానియాలో విద్యార్థులు మాత్రం ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మంత్రుల కార్యక్రమం నగరంలో ఎక్కడ జరిగినా అడ్డుకోవాలని నిర్ణయించారు.
క్రమబద్దీకరణ వివాదం
ఎన్నికలకు ముందు కూడా ఈ అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే, కెసిఆర్ తన హామీ నుంచి వెనక్కి తగ్గలేదు.
క్రమబద్దీకరణ వివాదం
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రశేఖర రావు యూనివర్సిటీ వైపురాగా ఉస్మానియా విద్యార్థులు అడ్డుకున్నారు.
క్రమబద్దీకరణ వివాదం
ఎన్నికలకు ముందు జెఎసి ఛైర్మన్ కోదండరామ్ను సైతం ఈ అంశంపై నిలదీశారు. మంత్రివర్గ నిర్ణయం తరువాత కోదండరామ్ ఇంటిని చుట్టుముట్టారు.
క్రమబద్దీకరణ వివాదం
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలుచేసి తీరాలనే నిర్ణయంతో ఉన్నారు.