శ్రీశైలం విద్యుత్తు గొడవ: మొదటికొచ్చిన కథ
హైదరాబాద్: శ్రీశైలం డ్యామ్వద్ద విద్యుదుత్పత్తి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఫిర్యాదులు చేసింది. దీంతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్కె పండిట్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం శనివారం ఉన్నత స్ధాయిసమావేశంలో శ్రీశైలం విద్యుత్ విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి చెక్ పెట్టేందుకు కార్యాచరణను ఖరారు చేయనుంది.
854 అడుగులు నీటి మట్టం వరకు శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడానికి వీలుంది. అంతవరకు తాము విద్యుదుత్పత్తిని ఆపేది లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. అయితే, విద్యుదుత్పత్తి కొనసాగించడం వల్ల నీట మట్టం తగ్గితే రాయలసీమ హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది.
రాయలసీమకు తాగునీరు అందించేందుకు శ్రీశైలంలో కుడిగట్టు విద్యుదుత్పత్తి నిలిపివేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గత 18నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేసిన అధికారులు, తెలంగాణ పరిధిలోని ఎడమ కేంద్రం నుంచీ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరారు. దీనికి ససేమిరా అన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజూ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కార్యదర్శి కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తూ గతంలో జారీ చేసిన 69, 107 నంబర్ల జీవోలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది.
అయినప్పటికీ 22, 23 తేదీల్లో ఎడమ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కొనసాగింది. అయితే గురువారం రాత్రి విద్యుదుత్పత్తిని నిలిపివేసిన తెలంగాణ అధికారులు, తిరిగి శుక్రవారం ఉదయం ఉత్పత్తిని ప్రారంభించారు. గురువారం నిలిపివేసిన ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించారు.
విద్యుదుత్పత్తి నిలిపివేసే అంశంపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను వివరిస్తూ గురువారం బోర్డుకు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి బిష్నోయికి కూడా మరో ఫిర్యాదు పంపించింది. రాయలసీమకు తాగునీరు అందించాల్సి ఉందని, అందువల్ల విద్యుదుత్పత్తిని నిలిపివేయాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. అందుకే గత ఆదేశాలు అమలు జరిగేలా తెలంగాణను ఆదేశించాలని తమ ఫిర్యాదులో వివరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డు చైర్మన్ పండిట్ శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రితోనూ మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాస్తవ పరిస్థితులు, రిజర్వాయర్లో ఉన్న నీటిమట్టం, తాగునీటి అవసరాలు, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలను పండిట్కు రాష్ట్ర అధికారులు వివరించారు. ఏపీ వాదనలు, అభ్యంతరాలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్ త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇదిలావుంటే, నాగార్జునసాగర్ నుంచి దిగువకు నీటి విడుదలపైనా చర్చించారు. ఎక్కువ నీటిని కిందకు విడుదల చేయడం వల్ల పులిచింతల వద్ద గ్రామాలు ముంపునకు గురవుతాయని ఏపీ అధికారులు బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పులిచింతల ఎస్ఇ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాగర్ అధికారులకు లేఖ రాసిన విషయాన్ని వారు బోర్డుకు వివరించారు. 11వేల క్యూసెక్కుల కన్నా ఎక్కువ విడుదల చేయకుండా చూసుకోవాలని లేఖలో కోరగా, సాగర్ యంత్రాంగం శుక్రవారం తమ లేఖకు సానుకూలంగానే స్పందించిన విషయాన్ని కూడా వెల్లడించారు.