'సమైక్యానికి' ప్రత్యేక రాయలసీమ సెగ
సాయంత్రం నిర్వహించిన సభలో రాయలసీమ పరిరక్షణ సమితికి చెందిన పట్నం రాజేశ్వరి నేతృత్వంలో పలువురు మహిళా కార్యకర్తలు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నినాదాలు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉంటూ అన్ని విభాగాల్లో నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందేనని ఇదే విషయాన్ని శ్రీ కృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పిందన్నారు. తెలంగాణవాదులు ప్రత్యేకంగా విడిపోవాలన్న భావనలో వారున్నారని, తెలంగాణ విడిపోతే రాయలసీమను కూడా ప్రత్యేకంగా విభజించాల్సిందేనని పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.
సమైక్యవాదం పేరుతో రాయలసీమ ప్రజలను ఇంకా దోచుకునే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గందరగోళం చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రత్యేక రాయలసీమవాదులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆ తరువాత కార్యక్రమం సాఫీగా జరిగింది. సమైక్యవాదానికి ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర సెగ తాకుతోంది.
మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని ఆయన వాదిస్తూ సభలు పెడుతున్నారు. అయితే, ఆయన రాయలసీమను కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విడిపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ప్రస్తుతం ముందుకు వస్తోంది.
మద్రాసు నుంచి తెలంగాణ ప్రాంతాలు విడిపోయే సమయంలో రాయలసీమకు కోస్తాంధ్ర నాయకులు ప్రత్యేక హామీలు ఇచ్చారు. రాయలసీమ ప్రయోజనాలను రక్షించడానికి శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబిక అమలులో ఉల్లంఘనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తేలోగానే హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో రాయలసీమకు ఇచ్చిన ప్రత్యేక హామీల ఊసులు లేకుండా పోయింది.