ఆపరేషన్: షర్మిల వర్సెస్ వైయస్ పాదయాత్ర
ప్రస్తుతం షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కేవలం తమ పార్టీ వ్యాల్యూ పెంచుకునేందుకేనని.. నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రనే అసలైనదని చెప్పబోతున్నారు. ఎ.బి.శ్రీనివాస్, జిట్టా సురేందర్ రెడ్డిలు రాజకీయ నేపథ్యంలో ఆపరేషన్ దుర్యోధన-2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతి బాబు, సోనియాలు నటిస్తున్నారు. ఈ సినిమాలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు.
ఆపరేషన్ దుర్యోధన-2 చిత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్ పెంపొందించేందుకే అనే వాదనలు ఇప్పటికే వచ్చాయి. ఈ చిత్రంలో కిరణ్ను సమర్థుడిగా చూపించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో పాదయాత్రల పైనా సెటైర్లు విసురనున్నారట. 2003లో వైయస్ పాదయాత్ర చేపట్టి 2004లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైయస్ పాదయాత్రను ప్రస్తావించనున్నారట.
వైయస్ను తమ వాడిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెసు పలు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైయస్ పాదయాత్రను కీర్తిస్తూ... షర్మిల మరో ప్రజా ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలపై సెటైర్లు వేయనున్నారట. వైయస్ పాదయాత్రనే అసలైన పాదయాత్ర అని... షర్మిల, బాబులు చేస్తున్న యాత్రలు కేవలం తమ తమ ఇమేజ్ పెంచుకునేందుకే తప్ప ప్రజల కోసం కాదని ఈ చిత్రంలో పరోక్షంగా సినిమాలో చెప్పనున్నారని సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు మాట్లాడుతూ... 2003లో జరిగిన పాదయాత్రనే అసలైన పాదయాత్రగా చిత్రంలో ఆవిష్కరిస్తున్నామని... ప్రస్తుతం ఫేస్ వాల్యూ పెంచుకునేందుకు ఒకరు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరొకరు పాదయాత్రలు చేస్తున్నారని, ఆ విషయాల్నిసినిమాలో చెబుతున్నామని వారు చెప్పారు. ప్రస్తుతం పాదయాత్రలు చేస్తున్న వారు షర్మిల, చంద్రబాబులు కావడం గమనార్హం. కాగా కీహోల్ ఆపరేషన్ కారణంగా షర్మిల పాదయాత్రకు మూడు వారాలు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఆపరేషన్ దుర్యోదన-2 చిత్రంలో నాటి వైయస్ పాదయాత్రను అసలైన యాత్రగా చెప్పనున్నారు. నేడు జరుగుతున్న పాదయాత్రలను కూడా ప్రస్తావించనున్నారు.
2003లో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి.. 2004లో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఆయన పాదయాత్ర అప్పట్లో సంచలనం సృష్టించింది.
తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. దాదాపు ఆరు నెలలు మూడు వేల కిలోమీటర్లు ఆమె పాదయాత్ర చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. సినిమాలో షర్మిల, చంద్రబాబు పాదయాత్రల పైన సెటైర్లు వేసే అవకాశముంది.