న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపిచంద్ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వదిలేట్లు లేదు. సమయం చిక్కినప్పుడల్లా ఆయనపై జ్వాలా గుత్తా విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్పై బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
బుధవారం ఓ టీవీ చానల్తో మాట్లాడిన జ్వాల గోపీ సమర్థవంతమైన డబుల్స్ కోచ్ కాదని వ్యాఖ్యానించింది. అతని స్థానంలో నిపుణుడైన డబుల్స్ కోచ్ను నియమించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)ను కోరింది. లేకుంటే గోపీ వద్ద తాను శిక్షణ తీసుకోనని స్పష్టం చేసింది. ఇక తనపై వస్తున్న విమర్శలకు ఆటతీరుతోనే సమాధానం చెబుతానని తెలిపింది.
గతంలో తనపై బాయ్ నిషేధం విధించడానికి సిద్ధపడిన సమయంలో కూడా జ్వాలా గుత్తా గోపీచంద్పై మండిపడ్డారు. తనపై బాయ్ ప్రతిపాదించిన జీవిత కాలం నిషేధంపై గోపీచంద్ ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె అడిగారు. మాజీ కోచ్లు ఆరిఫ్, విమల్ బహిరంగంగా మాట్లాడారని, విమల్ బంగా బీట్స్ కోచ్గా వ్యవహరించారని, విమల్ కూడా ప్రకటన చేశారని, వారు మాట్లాడినప్పుడు గోపీచంద్ ఎందుకు మాట్లాడడం లేదని ఆమె అన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.
గోపీచంద్ తన అకాడమీకి మాత్రమే కోచ్గా వ్యవహరిస్తున్నారా, మొత్తం దేశానికి కోచ్గా వ్యవహరిస్తున్నారా అని జ్వాలా అడిగారు. జ్వాలా నువ్వు చేసింది తప్పని గోపీచంద్ చెప్పవచ్చునని, ఓ వైఖరి తీసుకోవాలని, ఎందుకు మాట్లాడడం లేదని ఆమె అన్నారు.