కీడు: 14వ జిల్లాకు ఏపీ ప్లాన్, అల్లూరి పేరు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 14వ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందట. 13 అనే సంఖ్యను ఏపీ సర్కార్ కీడుకు సంకేతంగా భావిస్తోందట. దీంతో జిల్లాల సంఖ్యను 14కు పెంచాలని చూస్తోందట. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న జిల్లాలకు మరో జిల్లాను కలిపి 14 జిల్లాల రాష్ట్రంగా ఏపీని మార్చాలని నిర్ణయించుకుందట. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఏపీలో కలిసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు గిరిజనులు అధికంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలోని 10 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు మండలాలను కలిపి మొత్తం 20 మండలాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.
దీనికి అవసరమైన ప్రతిపాదనలను ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపినా వాటికి జిల్లా కేంద్రమైన ఏలూరు చాలా దూరంగా ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని భావిస్తే, అక్కడ ఇప్పటికే ఉన్న రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలు జిల్లా కేంద్రమైన కాకినాడకు దూరంగా ఉన్నాయి.
దీనివల్ల ఈ మండలాల్లోని గిరిజనులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గిరిజన మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాగా చేస్తే గిరిజన ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందట. కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేయనున్నారట. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆగస్టు 15న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయంటున్నారు.