బాబుకు చేదుమాత్ర: డీఫాల్టర్లుగా ఎపి రైతులు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రుణమాఫీ వ్యవహారం మింగలేని చేదుమాత్రగా మారే ప్రమాదం వచ్చి పడింది. రుణమాఫీకి మార్గదర్శ సూత్రాల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు లక్షలాది మంది రైతులను రుణాల ఎగవేతదారులుగా ప్రకటించే ప్రమాదం వచ్చి పడింది.
త్రైమాసికానికి (ఏప్రిల్ - జూన్ క్వార్టర్) బ్యాలెన్స్ షీట్లను మూసివేసేలోగా రాష్ట్ర ప్రభుత్వం తన పథకం గురించి స్పష్టంగా ముందుకు రాకపోతే నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్స్ కిందికి వ్యవసాయ రుణాల ఖాతాలు వెళ్లిపోతాయని, దానివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతారని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అధ్యక్షుడు ఆంధ్రబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సివిఆర్ రాజేంద్రన్ అన్నారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ఈ విషయం చెప్పారు.
ఇప్పటికే రైతులు డిఫాల్టర్లుగా మారారని, లక్షలాది మంది రైతులు ఎన్పిఎ కిందికి వెళ్తారని ఆయన అన్నారు. ఎన్నికల్లో రైతుల రుణమాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, రుణమాఫీకి నిబంధనలు ఆటంకంగా మారాయి.
పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి, రుణ మొత్తాన్ని సేకరించడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ప్రస్తుత స్థితి వల్ల బ్యాంకులు 87 వేల కోట్ల రూపాయల మేర బకాయిలను వసూలు చేయలేని స్థితిలో పడ్డాయని రాజేంద్రన్ అన్నారు.