కెసిఆర్ ఫొటో మార్ఫింగ్: టిడిపి వాళ్ల పనే?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టిన తెలుగుదేశం కార్యాలయ ఫేస్బుక్ నిర్వాహకులపై హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ ఫొటోను మార్చి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కేసీఆర్ అభిమానులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు కేసీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకర్ణి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుశీలారెడ్డి ఈ నెల 12వ తేదీన ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505లతో పాటు, 66ఏ ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేసి, ఫేస్బుక్ ఖాతా నిర్వాహకులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీడియాపై కెసిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. కెసిఆర్పై పలు వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం కార్యాలయం ఫేస్బుక్ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించి కెసిఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు భావిస్తున్నారు.