హైదరాబాద్ మెట్రోపై కేంద్రం పెత్తనమా?
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే, దాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఖండిస్తున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి తమకు అన్ని సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచే వస్తున్నాయని వారు చెప్పారు.
వేయి కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర పాలనాయంత్రాంగంలోని వివిధ శాఖలకు తాము వివరాలను అందించాల్సి ఉంటుందని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ఇది సాధారమైన విషయమేనని, తాము ఇచ్చిన సమాచారంపై కేంద్రం నుంచి ఏ విధమైన అభ్యంతరాలు రాలేదని వారంటున్నారు.
ఏం జరుగుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు అందించడం వరకేనని, అంతకు మించి కేంద్రం జోక్యం ఉండదని అంటున్నారు. చారిత్రక ప్రదేశాల వద్ద మెట్రో ప్రాజెక్టు చేపట్టే విషయం వివాదంగానే ఉంటుందని కూడా అంటున్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అధికారులు వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేశారు.
అయితే, ఇప్పటి వరకు దానిపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఏదీ ఇవ్వలేదు. దాంతో ముందటి ప్లాన్ ప్రకారమే ఎల్ అండ్ టీ తన పనులు సాగిస్తోందని అంటున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చే వరకు గత ప్రణాళిక ప్రకారమే తాము ముందుకు సాగుతామని చెబుతున్నారు. అప్పటి వరకు మార్పులను పరిగణనలోకి తీసుకోబోమని చెబుతున్నారు.