బాబు ఎంట్రీ ఇష్యూ: బిర్లా టెంపుల్పై వాచ్ టవర్?
హైదరాబాద్: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఛేంబర్లోకి వెళ్లే మార్గం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థితిలో చంద్రబాబుకు భద్రత ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు వంటి అంశాలపై నిఘా విభాగం అధికారులు, ఇతర అధికారులు తీవ్రమైన చిక్కులను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ రోడ్ మ్యాప్ దీనికోసం తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తాజాగా, ఎల్-బ్లాక్లోని తన కార్యాలయానికి వచ్చేందుకు గతంలో ఉన్న పాత గేటును వినియోగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ గేటును నడక దారిని సచివాలయానికి వచ్చేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఉదయం గంటసేపు, సాయంత్రం మరో గంట పాటు మాత్రమే ఈ గేటును తెరిచి ఉంచుతున్నారు. ఇప్పుడు ఈ గేటును చంద్రబాబు లోపలకు వచ్చేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎల్-బ్లాక్లోని ఎనిమిదో అంతస్తుకు ఆయన చేరుకునేందుకు కూడా పాత గేటు పక్కనే ఉన్న లిఫ్ట్ను ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇంత కాలం పాత ముఖ్యమంత్రులు సచివాలయానికి వచ్చే గేటును ఉపయోగించాలని, ఎల్-బ్లాక్లో కూడా వెనుక ఉన్న రెండో లిఫ్ట్ను ఉపయోగించాలని భావించారు. తాజాగా ఈ ప్రతిపాదనలు మార్చుకుని, పాత గేటు, మూడో లిఫ్ట్ను ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో ఎల్-బ్లాకు ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో భద్రతపై కూడా ఇంటలిజెన్స్ అధికారులు దృష్టి సారిస్తున్నారు.
రోడ్డుకు ఒకవైపు ఎల్-బ్లాక్, ఇంకొక వైపు ఎత్తయిన భవంతులు ఉండడంతో భద్రత కూడా సమస్యాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. అందుకే అన్నింటికన్నా ఎత్తుగా ఉన్న బిర్లా టెంపుల్లో వాచ్టవర్ను ఏర్పాటు చేసేందుకు కూడా నిఘా వర్గాలు ఆలోచిస్తున్నాయి.