చంద్రబాబు అసహనం: ఫోన్లో రహస్య చర్చలు?
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం అనూహ్యమైన పరిస్థితి నెలకొంది. ఏలూరులోని లోక్సభ అభ్యర్థి మాగంటి బాబు నివాస గృహంలో బసచేసిన చంద్రబాబు అసహనంతో కనిపించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు ఆయన అర్ధంతరంగా అపాయింట్మెంట్ నిలిపివేశారు.
రాత్రి 11 గంటల నుంచి గంటకు పైగానే ఏకాంతంగా ఫోన్ ద్వారా మంతనాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక బీజేపీ నేతల తీరుని ఆ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. చంద్రబాబు అభ్యర్థుల జాబితాపై ఏలూరు పర్యటనలో కొంత కసరత్తు చేయాలని భావించారని, అయితే, యాత్ర ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళన, నిరసనలు వ్యక్తం కావడంతో ఆయన పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు.
తెలుగుదేశం అభ్యర్థులు ఏకపక్షంగా గెలిచే స్థానాలను బిజెపి కోరుకోవడం ఈ స్థానాల్లో టిక్కెట్లు ఆశించిన టిడిపి ముఖ్యులు అసంతృప్తి, నిరాశకు గురవడం, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించే స్థాయికి చేరడం వంటి అంశాలను కూడా ఆయన పరిగణలోనికి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఉదయం తణుకులో ఉన్న చంద్రబాబును నరసాపురం లోక్సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా ఖరారైన గంగరాజు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఇదే స్థానం ఆశించి భంగపడిన కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా చంద్రబాబుతో అరగంటపైగానే మంతనాలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కార్యకర్తలు 'పార్టీని నాశనం చేయొద్దు' అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో చంద్రబాబు బిజెపి నేతలతో మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు.