గురుకుల్ ట్రస్ట్: సీలు వేశారు, గోడలపై రాశారు
హైదరాబాద్: రాజదాని నగరం హైదరాబాదులోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఆక్రమణలపై దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, ఇతర శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ దఫా కూల్చివేతల జోలికి వెళ్లలేదు. కానీ, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 11 వాణిజ్య, నివాస భవంతులకు 'సీలు' వేశారు. 'ఇవి అక్రమ నిర్మాణాలు' అంటూ వాటి గోడలపై రాశారు.
ఖాళీ స్థలాల్లో 'ఇవి ప్రభుత్వ భూములు' అని బోర్డులు పెట్టారు. ప్రభుత్వ, ట్రస్టు భూములను రక్షించేందుకు వివిధ శాఖలతో పది సూత్రాల కార్యక్రమం రూపొందించి, దాని ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు.
గురుకుల్ ట్రస్టుకు చెందిన 300 ఎకరాల భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, అయ్యప్ప సొసైటీ స్థలాల యజమానులు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకొనేందుకు ప్రయత్నించారు.
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేదంటూ పోలీసులు తమను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు తమకు చెందేవరకు పోరాడుతామని వారు తెలిపారు. బాధితులను కలుసుకోవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇష్టపడడం లేదని అంటున్నారు.