ఏపీ రాజధాని: సచివాలయంలో హుండీ, తొలగింపు
హైదరాబాద్: కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉండటమే కాకుండా.. రాజధాని కూడా లేదు. ఈ నేపథ్యంలో రాజధాని కోసం విరాళాలు సేకరిస్తోంది. అందులో భాగంగా హుండీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుండీల మార్గం కూడా ఎంచుకుంది. ఏపీ సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో లిఫ్టు వద్ద హుండీలను ఏర్పాటు చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి విరాళముల నిమిత్తము అని దానిపై రాసి, ప్రభుత్వ అధికార చిహ్నం కూడా ముద్రించారు.
ఈ హుండీల ఏర్పాటు చర్చనీయాంశమైంది. పలువురు అందులో డబ్బులు వేస్తున్నారు. సాధారణంగా దేవాలయాల్లో హుండీలు ఉంటాయి. హుండీలలో డబ్బులు వేస్తున్న వారు... రాష్ట్రానికి రాజధాని లేదని, ఇలాంటప్పుడు అందుకోసం హుండీలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నారు.
అంతకుముందు లేక్ వ్యూ అతిథి గృహంలో హుండీ పెట్టారు. ఇప్పుడు సచివాలయంలో పెట్టారు. అయితే ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా హుండీ ఏర్పాటు చేయడంపై సందిగ్ధ పడ్డారట. సీఎస్తో మాట్లాడి ఆ తర్వాత హుండీని తొలగించారు. చంద్రబాబుతో మాట్లాడి లేక్ వ్యూలోని హుండీ కూడా తొలగించే అవకాశముంది.