కేసీఆర్ ఎఫెక్ట్: నాగ్ దిద్దుబాట, కన్వెన్షన్లో తొలగింపు!
హైదరాబాద్: గురుకుల్ ట్రస్టులో అఖ్రమ నిర్మాణాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ్మిడికుంట చెరువు శిఖం స్థలంలో ప్రముఖ సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సర్వేలో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 3 ఎకరాల 12 గుంటల స్థలాన్ని శిఖం భూమితో పాటు బఫర్ జోన్గా అధికారులు గుర్తించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన నాగార్జున కోర్టుకు వెళ్లారు. నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. శనివారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్లోని కొన్ని నిర్మాణాలను యాజమాన్యం స్వచ్చందంగా తొలగించింది.
ఎఫ్టీఎల్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలను తొలగించారు. హైకోర్టు కాపీ అందక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్కు నోటీసులు జారీ చేయలేదట. అయితే, తాము న్యాయబద్దంగానే నిర్మించామని చెప్పిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం.. ఇప్పుడు స్వచ్చంధంగా నిర్మాణాలు తొలగించడమేమిటని అంటున్నారు.