జగన్ వచ్చారు: కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తే..
మెదక్/హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో కేసీఆర్ ఇక్కడకు రావాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రమాదం నాలుగు గ్రామాల ప్రజలను కన్నీటిలో ముంచింది.
వారిని పరామర్శించేందుకు పలువురు రాజకీయ నాయకులు సంఘటన స్థలానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు టీడీపీ, కాంగ్రెసు నేతలు వచ్చారు. చంద్రబాబు ఏపీ పర్యటనలో ఉన్నందున రాలేదని టీడీపీ చెప్పింది.
తెరాస నేతలు, మంత్రులు కూడా వచ్చారు. అయితే, కేసీఆర్ నియోజకవర్గం అయినందున ఆయన రాకపోవడాన్ని స్థానికులు ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారని, తెలంగాణ సీఎం అయిన కేసీఆర్.. సొంత నియోజకవర్గంలో ప్రమాదం జరిగినప్పుడు రారా అని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి పైన లాఠీఛార్జ్ చేశారు. కాగా, ఇటీవల గెయిల్ ప్రమాదం జరిగినప్పుడు చంద్రబాబు ఢిల్లీ నుండి వచ్చి పరామర్శించారని చెబుతున్నారు.
కేసీఆర్ రానందున పలువురు స్థానికులు నిరసన తెలిపారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ప్రతిగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. కాగా, తెలంగాణ మంత్రి హరీష్ రావు తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. వారం రోజుల్లో గేటును పెట్టించే బాధ్యత తనదని, బాధితులకు పూర్తిన్యాయం చేస్తామని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.