ఆంధ్రోళ్లను వెళ్లగొట్టేందుకే: కేసీఆర్ పీఆర్వో సంచలనం
హైదరాబాద్లోని ఆంధ్రా విద్యార్థులను, ఉద్యోగులను వెళ్లగొట్టడానికే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పీఆర్వో విజయ్ వ్యాఖ్యానించారట. వరంగల్ ప్రెస్క్లబ్లో ఇటీవల ఒక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ను శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి బయటపెట్టారు.
అందులో... సర్వేకు సంబంధించిన ఫార్మాట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పుచేర్పులు చేయడానికి వీలులేకుండా తయారు చేశామని, వాస్తవంలో ఇది హైదరాబాద్లో ఉన్న లక్షమంది ఆంధ్రా విద్యార్థులను వెళ్లగొట్టడానికని, అక్కడే ఉన్న 55 నుంచి 60 వేల మంది దాకా గల ఆంధ్రా ఉద్యోగులను వెళ్లగొట్టడానికి చేస్తున్న సర్వే ఇది అని చెప్పినట్లుగా ఉంది.
తాను ఆఫ్ ద రికార్డుగా ఇది చెబుతున్నానని, అందువల్ల ఈ సర్వేను మనం విజయవంతం చేసుకోవాలని, దాని కోసం మనం నిజాలు రాసుకోవాలని విజయ్ అన్నారని చెప్పినట్లుగా ఉంది.
కాగా, స్వయంగా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు కావడంతో సంచలనమే అంటున్నారు. కేసీఆర్ పీఆర్వో వ్యాఖ్యల పైన వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఆర్వో చేసిన వ్యాఖ్యలను బట్టి సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం ఈ సర్వే వెనుక ఉన్న రహస్య ఎజెండా బయట పెట్టాలని డిమాండ్ చేశారు.