'బతకడానికొచ్చారు.. చక్రం తిప్పొద్దు, కోసినా నేనంతే'
బతుకుదెరువు కోసం వచ్చిన ఆంధ్రోళ్ల జోలికి తాము పోమని, వారు చక్రం తిప్పాలని చూస్తే మాత్రం సహించబోమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఆయన శనివారం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సచివాలయంలో వేలు పెట్టాలని చూస్తేనే పంచాయతీ వస్తుందన్నారు. బతకడం కోసం వచ్చి మీ ప్రత్యేకతను మీరు నిలుపుకుంటామంటే ఊరుకుంటామా అన్నారు. మీరంత జిద్దుగా ఉంటే తాము ఉంటామన్నారు. తాము వచ్చి విజయవాడలో పోటీ చేస్తే సహిస్తారా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ ఆంధ్రోళ్ల కుట్రలు కొనసాగుతున్నాయని, ఆంధ్రోళ్లతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అయితే, వారి వెనుకాల ఉండి రాజకీయం చేస్తున్న వారితోనే కిరికిరి అన్నారు. తెలంగాణను తెలంగాణ వాళ్లే పాలించాలన్నారు. దినేష్ రెడ్డి, జెపిలు మల్కాజిగిరి నుండి పోటీ చేయడమేమిటని ప్రశ్నించారు.
ఉద్యోగుల ఆప్షన్ల పైన కెసిఆర్ మరోసారి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలని తాను గతంలో అన్నానని, అందులో తప్పేముందని చెప్పారు. వాళ్లు ఇక్కడే ఉంటే ఆంధ్రా ప్రభుత్వం ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. తనను కొట్టినా, కోసినా అలాగే మాట్లాడుతాననన్నారు.