శ్రవణ్కు కెసిఆర్ అన్యాయం: పదేపదే పవన్ కళ్యాణ్
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నిజామాబాద్, హైదరాబాదు సభల్లో, బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనను కలిసిన సమయంలో.. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రధానంగా టార్గెట్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో పవన్ ముఖ్యంగా దాసోజు శ్రవణ్ కుమార్ గురించి పదే పదే ప్రస్తావించారు. శ్రవణ్ విద్యావంతుడని, తెలంగాణ కోసం ఎంతో తాపత్రయపడిన వ్యక్తి అని పవన్ చెబుతున్నారు. శ్రవణ్లాంటి వారికి కూడా కెసిఆర్ కులం పేరు చెప్పి టిక్కెట్ నిరాకరించారని పవన్ ఆరోపణలు గుప్పించారు.
టిక్కెట్ ఇవ్వడానికి కులం ఎందుకని, గుణం ముఖ్యమని కెసిఆర్కు చురకలు అంటించారు. 2009లో శ్రవణ్ కుమార్ తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎన్నికలలో పోటీ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పరితపించిన శ్రవణ్ వంటి వ్యక్తికి కులం పేరు చెప్పి టిక్కెట్ నిరాకరించడం సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్ సభతో పాటు గురువారం హైదరాబాదులో తన నివాసం వద్ద కూడా పవన్ శ్రవణ్ గురించి ప్రస్తావించారు. 2009లో పిఆర్పీ నుండి సికింద్రాబాదు లోకసభకు పోటీ చేసిన శ్రవణ్ కుమార్ ఆ తర్వాత తెరాసలో చేరారు. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భువనగిరి స్థానాన్ని ఆశించారు. కానీ కెసిఆర్ నుండి ఆయనకు చుక్కెదురయింది. దీంతో అతను కాంగ్రెసు పార్టీలో చేరారు. కెసిఆర్ను టార్గెట్ చేశారు.