దక్షిణాఫ్రికా అధ్యక్షుడి భార్యను రేప్ చేశారట
జోహన్నెస్బర్గ్: తన ఫాంహౌస్ ఆధునీకరణకు 23 మిలియన్ డాలర్లు వెచ్చించడంపై వస్తున్న విమర్శలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. "నాకు భద్రత అవసరంలేదని అనుకుంటున్నారా? ఇప్పటి పరిస్థితులెలా ఉన్నాయి? తగిన భద్రత ఏర్పాట్లు లేకపోవడం వల్లే 1998లో నా భార్య అత్యాచారానికి గురైంది'' అని ఆయన చెప్పారు. దుండగులు లోపలికి చొరబడి తన భార్యపై అత్యాచారం జరిపారని ఆయన చెప్పారు.
అయితే అత్యాచారం జరిగిన దశాబ్దం తర్వాత 2009లో ఈ ఆధునికీకరణ పనులు చేపట్టడం వెనుక మర్మమేమిటన్నది సాధారణ ప్రజలను తొలుస్తున్న ప్రశ్న. తాను అధ్యక్షుడిని కాక ముందు 2009లో ఆ సంఘటన జరిగిందని చెప్పారు. ఫాంహౌజ్ ఆధునికీకరణ కోసం పెద్ద మొత్తంలో ప్రజాధనం వెచ్చించడంపై పెద్దఎత్తులో దుమారం రేగడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తన నలుగురు భార్యల్లో ఏ భార్య అత్యాచారానికి గురైందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఫాంహౌజ్పై వెచ్చించిన సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాలని విచారణ సంఘం సూచించగా, జుమా నిరాకరించారు. దీనిపై క్రితం వారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో చర్చ కోసం కొందరు సభ్యులు పట్టుబట్టారు.
అయితే ఎన్నికల ముందు గతాన్ని తవ్వుకోవడం ఇష్టం లేని నాయకులు వ్యతిరేకించి, ఎన్నికల తర్వాత చూడొచ్చంటూ వాయిదా వేశారు. దేశంలో ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫాంహౌజ్ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దశాబ్దం క్రితం జరిగిన సంఘటనను బయటికి తీశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి అత్యాచారం ఘటనలో నిందితులను గుర్తించి, శిక్షించడం కూడా జరిగిందన్నది వారి వాదన.