సర్వేపై జగన్ వ్యాఖ్య: కెసిఆర్ చురకలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వివరాలు సేకరించేందుకు తన ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు తెంలగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో చురకలు అంటించారు.
తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలోకి రాను కదా, సమగ్ర కుటుంబ సర్వే ఫారాలను నింపాల్సిన అవసరం ఉందా, అయినా సేర తన వివరాలు అందించేందుకు ఏ విధమైన అభ్యంతరాలూ లేవని, మీ ఫారాలపై సంతకం చేస్తున్నా తీసుకోండి అని జగన్ ఎన్యుమరేటర్లతో అన్నారు.
ఎన్యుమరేటర్లు మంగళవారం ఉదయం జగన్ నివాసానికి వెళ్లారు. అయితే, జగన్ లేరని, శాసనసభకు వెళ్లారని సిబ్బంది చెప్పారు. జగన్ వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని, ఆయన సరేనంటే చెప్పడానికి ఫోన్ నెంబర్ కావాలని కూడా చెప్పారు. దీంతో టీమ్ లీడర్ సిద్ధప్ప ఫోన్ నెంబర్ ఇచ్చారు. సాయంత్రం సిద్ధప్పకు ఫోన్ వచ్చింది. సాయంత్రం ఎన్యుమరేటర్లు రాగానే తాను సంక్షేమ పథకాల పరిధిలోకి రాను కదా అంటూ సంతకం చేసిన ఫారాన్ని అందించారు. నవ్వుతూ కరచాలనం చేశారు. వివరాలను ఆయన వ్యక్తిగత సహాయకురాలు అందించారు.
కాగా, సంక్షేమ పథకాల పరిధిలోకి రాము కదా అంటూ కొందరు వ్యాఖ్యానించారని కెసిఆర్ అంటూ కేవలం సంక్షేమ పథకాల కోసమే కాదు కదా ఈ సర్వే, అసలు హైదరాబాదులో ఎంత మంది ఉంటున్నారో అంచనా వేసి, అందుకు అనుగుణంగా హైదరాబాదుకు అవసరమైన పథకాలు రూపకల్పన చేసి అమలు చేయాలి కదా అన్నారు. హైదరాబాదుకు ఎంత మంచనీరు అవసరమో తెలియడానికి కూడా సర్వే పనికి వస్తుంది కదా అని కెసిఆర్ అన్నారు.