Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఈ హీరోలంతా 'డ్యూయల్ రోల్స్' తో బిజీ(ఫొటో ఫీచర్)
హైదరాబాద్: ద్విపాత్రాభినయాలు ఫార్ములా పాతదే అయినా దర్శకుడు ఎలా చూపించాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం కాస్త అటూ.. ఇటూ.. అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. రెండు పాత్రలు ఉన్న సినిమాలు చేసేటప్పుడు ఆ పాత్రపై మమకారంతోనో.. దర్శకుడి ప్రోద్బలంతోనే నటిస్తే.. అవి వికటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే అన్నీ అలానే అవుతాయని చెప్పలేం. ఏది చేసినా ప్రేక్షకుడిని ఒప్పించి, మెప్పించగలిగితే ఆ చిత్రానికి 'డబుల్'ధమాకానే.
ద్విపాత్రాభినయం... తెలుగు సినీ పరిశ్రమకు ఈ పదం కొత్తేమీ కాదు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ నుంచి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ద్విపాత్రాభినయంతో అలరించిన వారే. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ద్విపాత్రాభినయం అంటే ఒకే రూపం ఉన్న రెండు వేర్వేరు పాత్రలు ఒకే ఫ్రేంలో కన్పించడం.
కథను బట్టి కొన్నిసార్లు ఒకే ఫ్రేంలో కనిపించకపోవచ్చు. అయితే రెండు విభిన్న పాత్రలను తమ అభిమాన హీరో వెండితెరపై పోషిస్తుంటే.. ప్రేక్షకుడికి వచ్చే ఆ కిక్కే వేరు. తాజాగా టాలీవుడ్ ప్రేక్షుకులు మరోసారి ఆ అనుభూతిని పొందబోతున్నారు.
స్లైడ్ షోలో త్వరలో మనం చూడబోతున్న ద్విపాత్రాభినయం చిత్రాలు ...
బాహబలి
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. రాణా కీలక పాత్ర పోషిస్తుండగా.. అనుష్క, తమన్నా నాయికలుగా అలరించనున్నారు. ఇందులో ప్రభాస్ను రెండు పాత్రల్లో జక్కన్న చూపించనున్నారు. బాహుబలిగా, శివుడిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించగా, కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ జానపద అద్భుతాన్ని చూడాలంటే వచ్చే ఏడాది దాకా ఆగాల్సిందే.
రభస
పాత్ర ఏదైనా పాదరసంలా దూసుకుపోయే యంగ్ హీరో యంగ్టైగర్ ఎన్టీఆర్. తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'రభస'. సమంత, ప్రణీత కథానాయికలు. ఇందులో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. రెండు పాత్రలూ.. పంచే వినోదం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం కృషి చేస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలాలో రెండు పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
జెండాపై కపిరాజు
సినీ పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నాని. ఆది నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ... అందర్నీ అలరించారు. యువతను విశేషంగా ఆకర్షించే దర్శకుడు సముద్రఖని. ఆయన ప్రతీ చిత్రం విభిన్నంగా సాగుతుంది. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం 'జైండాపై కపిరాజు' అమలాపాల్ నాయిక. ఇందులో నాని రెండు పాత్రల్లో కన్పించనున్నారు. అమలాపాల్ కూడా రెండు పాత్రల్లో అలరించనుండటం మరో విశేషం. తమిళ హీరో 'జయం' రవి ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.
లింగా
సూపర్స్టార్ రజినీకాంత్ చిత్రం అంటే కొబ్బరికాయ కొట్టిన నాటి నుంచే అందరిలోనూ ఆసక్తి. తమ అభిమాన కథానాయకుడి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా... అని ఎదురు చూసే అభిమానులున్నారు రజనీకి. ఆయన తాజా చిత్రం లింగా లో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుష్క,సోనాక్షి సిన్హా ఈ పాత్రల సరసన కనిపించనున్నారు.
ఉత్తమ విలన్
ఆయన నటించే చిత్రంలో ఒక పాత్రా... రెండు పాత్రలా... పది పాత్రలా.. ఎన్ని పాత్రలైనా ఆయనకు చిటికె వేసినంత సులభం. ఒక నటుడు ఇన్ని పాత్రలు చేయగలడా? అని ఆశ్చర్యపోయేంత అద్భుతంగా రాణించగల నటుడాయన. ఇవన్నీ ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆయనే 'కమల్హసన్'. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమే ఆయనకు తెలుసు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఉత్తమ విలన్'. ఈ చిత్రంలో కమల్ ఎనిమిదో శతాబ్ధపు రంగస్థల నటుడిగా, యువకుడిగా రెండు పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు. మరి ఆయన నట 'విశ్వరూపం' చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే!
సికిందర్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ హీరో సూర్య. తెలుగులో ఆయనకు మంచి మార్కెట్ ఉంది. దర్శక నిర్మాతలు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం అంజాన్ (సికిందర్). సమంత హీరోయిన్. ఈ చిత్రంలో సూర్య కూడా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. గతంలో బ్రదర్స్ చిత్రంలో ఇదే విధంగా రెండు పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు సూర్య.
బాలకృష్ణ
బాలకృష్ణ తాజాగా చేస్తున్న గాడ్సే చిత్రంలోనూ డ్యూయిల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో చేసిన సింహా, లెజండ్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసారు. అవి మంచి విజయం సాధించాయి.