
రజనీ త్రీడీ యానిమేషన్ చిత్రం 'సుల్తాన్'ని ఆయన కుమార్తె సాందర్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విశేషాలను ఆమె మీడియాకు వెళ్లడించారు. "సుల్తాన్ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల్లాగే ఇదీ బిజెనెస్ పరంగా సంచలనం సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది. అలాగే తొలిసారిగా ఓ పూర్తిస్థాయి యానిమేషన్ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'సుల్తాన్' త్రీడీ యానిమేషన్ కావడంతో సాంకేతికంగా మరింత సమయం పడుతుంద"ని ఆమె వివరించారు.అంతేగాక రెగ్యులర్ గా రజనీ చిత్రాలు ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ గీతంతో మొదలవుతాయి. 'సుల్తాన్'లో కూడా ఆ తరహా పాట ఉంటుంది. దాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తారు. వచ్చే యేడాది చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసాం. ఈలోపు 'రోబో'గా రజనీ ప్రేక్షకుల్ని మురిపించనున్నారు అన్నారామె. రోబో చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీ సరసన ఐశ్వర్యా రాయ్ చేస్తున్నారు.


















