
హైదరాబాద్: మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజరుద్దీన్ గురువారం సాయంత్రం కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయన గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి పార్టీలో చేరుతారు. మైనారిటీ ఓట్లకు గాలం వేసేందుకు ఆయనను పార్టీలోకి తీసుకున్నట్లు సమాచారం. అజరుద్దీన్ చేరిక విషయాన్ని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ధృవీకరించారు. వచ్చే ఎన్నికల్లో అజర్ పోటీకి దించే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కాగా, ఐసిఎల్ క్రికెటర్ కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెసు పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు కౌశిక్ రెడ్డి చెప్పారు.
&13;
&13;










