ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన మానవబాంబుదాడిలో 15 మంది మృతి చెందగా మరో 70 మంది వరకు గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. మతగురువు సేర్ జమాన్ అంత్యక్రియలకోసం ఆయన అనుయాయులు పెద్ద వూరేగింపుతో వెళుతుండగా సుబ్ర హోటల్ వద్ద ఈ దాడి జరిగింది. రెండు మతసంస్థల మధ్య పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. దాడిలో గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. షేర్ జమాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కాల్చి చంపారు. మానవ బాంబు దాడి జరిగిన వెంటనే ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు విధ్వంసానికి దిగారు. పోలీసు చెక్ పోస్టును ధ్వంసం చేశారు. రోడ్లపై కార్ల మీద రాళ్ల వర్షం కురిపించారు. ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా బలగాలను లక్ష్యంగా ఎంచుకుని దాడులు చేశారు. వెంటనే మార్కెట్లను మూసేశారు.










