ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అశోక్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో బుధవారం ప్రతిఘటన గ్రూప్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అలియాస్ సుధాకర్ హతమయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు నక్సలైట్లు కూడా ఈ ఎన్ కౌంటర్లో మరణించారు. వరంగల్-కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో గల భూపతిపూర్ వద్ద ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా నక్సలైట్లు తారసపడ్డారని, ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని వరంగల్ జిల్లా ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
అశోక్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలం ఇర్సులాపురం. మృతుల్లో మేడారం దళ కమాండర్ చంద్రన్న ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరి గుర్తింపు తెలియడం లేదు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ ను, 8 ఎంఎం తుపాకిని, మూడు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిఘటన కనుమరుగైనట్లేనని సజ్జనార్ అన్నారు. సంఘటనా స్థలంలో గాలింపును ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.