హైదరాబాదుకు వైయస్ భౌతిక కాయం

గురువారం, సెప్టెంబర్ 3, 2009, 13:23 [IST]
YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఇతరుల భౌతిక కాయాలు గురువారం సాయంత్రం హైదరాబాదుకు చేరుకుంటాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. రాజశేఖర రెడ్డి మరణ వార్తను ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించే సమయంలో ఆయన ఉద్వేగాన్ని నిలువరించలేక కంట తడి పెట్టారు. మంత్రులు వైయస్ మరణవార్తను తట్టుకలేక విలపిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు వైయస్ మరణం వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన చెప్పారు. ఈ సాయంత్రం రెండు గంటలకు లాంఛనంగా మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మృతికి సంతాపకం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.



శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రజల సందర్శనార్థం వైయస్ భౌతిక కాయాన్ని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఉంచుతామని ఆయన చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆయన స్వస్థలం పులివెందులలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించిన మిగతా వారి మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి, వారికి తగిన సహాయం అందించడానికి ఐదుగురు మంత్రులను నియోగించినట్లు ఆయన తెలిపారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన వార్తను ప్రకటించాల్సి రావడం ఎంతో బాధగా ఉందని ఆయన అన్నారు. తన కన్నా పది, పద్నాలుగేళ్లు చిన్నవాడైన వైయస్ మృతి వార్తను ప్రకటించాల్సి రావడం భరించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ స్నేహం, వాత్సల్యం తనలాంటి వారు జీవితాంతం గుర్తు పెట్టుకునేదని ఆయన అన్నారు.

వైయస్ భౌతిక కాయంతో పాటు ఇతరుల మృతదేహాలను తొలుత కర్నూలుకు తరలిస్తారు. అక్కడి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుంది. అనంతరం హైదరాబాదుకు తరలిస్తారు. మృతదేహాలు గుర్తు పెట్టలేని విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets