పెట్రో, గ్యాస్ ధరలు తడిసి మోపెడు?

గురువారం, ఫిబ్రవరి 4, 2010, 9:52 [IST]
Petrol Bunk
న్యూఢిల్లీ: వంట గ్యాస్, పెట్రోల్, కిరోసిన్ ధరలు మండే అవకాశం ఉంది. కేంద్ర విధానం మారితే పెట్రో ఉత్పత్తుల ధరలు రెక్కలు విప్పుకోనున్నాయి. చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణలను పూర్తిగా ఎత్తివేయాలని చమురు కంపెనీల నష్టాలపై ఏర్పాటు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను అమలు చేస్తే ఇంధన ధరలు పెరిగి సామ్యానుడికి పెనుభారం కానుంది. కిరోసిన్‌పై లీటరుకు ఆరు రూపాయలు, ఎల్పీజీ సిలిండర్‌లపై వంద రూపాయలు పెంచాలని సూచించింది. ఈ మేరకు తన నివేదికను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరాకు బుధవారం అందజేసింది. కమిటీ సిఫారసులకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలపై నియంత్రణను తక్షణం ఎత్తివేస్తే పెట్రోలుపై లీటరుకు 4.70 రూపాయలు, డీజిల్‌ పై లీటరుకు 2.30 రూపాయలు అదనంగా భారం పడుతుంది.
  Read:  In English 
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచేందుకు ప్రభుత్వం తన ఆధీనంలోని చమురు కంపెనీలను అనుమతించడం లేదు. ఫలితంగా కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వంపై కూడా సబ్సిడీ భారం పడుతోంది. అయితే, ఇందుకు ధరల పెంపుదల, నియంత్రణల ఎత్తివేతను పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల విధానం మనజాలేదిగా లేదని నివేదిక సమర్పించిన అనంతరం పారిఖ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక సమస్యలను చమురు ధరల నిర్ణాయక విధానం పరిష్కరించగలదని పారిఖ్ అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను పోటీ మార్కెట్‌కు వదలిపెట్టేయాలని పారిఖ్ కమిటీ సూచించింది. ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే కిరోసిన్, గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీపై కొంత మేరకు సబ్సిడీ భరించవచ్చునని సూచించింది. ఈ నివేదికను పరిశీలించి తదుపరి చర్యల కోసం వారం రోజుల్లోగా కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతామని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా చెప్పారు.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets