
ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికే శివసేన కార్యకర్తలు నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా వారు బుధవారం పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విధ్వంసానికి దిగారు. దీంతో మల్టీప్లెక్స్ ల్లో అడ్వాన్స్ బుకింగ్ ఆగిపోయింది. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలవుతోంది. ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ మల్టీప్లెక్స్ లు, పెద్ద సినిమా హాళ్లు బుధవారం ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగులను ఆపేశాయి.
Read: In English
మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా విడుదలను అడ్డుకుంటామని, షారూఖ్ ఖాన్ మొదట తమ నేత బాల్ థాకరేకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే షారూఖ్ తో మాట్లాడుతామని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఈ స్థితిలో పోలీసులు దాదాపు వేయి మంది శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజుల నుంచి పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. మొత్తం 1,023 మంది కార్యకర్తల్లో 955 మందిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మై నేమ్ ఈజ్ ఖాన్ విడుదలయ్యే 63 థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రిజర్వ్ పోలీసులను, హోం గార్డులను కూడా రంగంలోకి దింపుతున్నారు.




















