
పూణే: పూణే జర్మన్ బేకరీ పేలుళ్లకు పాల్పడింది తామేనని నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి), ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకున్నాయి. పూణే జర్మన్ బేకరీలో ఈ నెల 13వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిలో 16 మంది మరణించారు. తామే పేలుళ్లకు పాల్పడినట్లు చెప్పుకుంటూ తమకు రెండు సంస్థల నుంచి లేఖలు వచ్చాయని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. అయితే లేఖలోని వివరాలను ఆయన వెల్లడించలేదు.
Read: In English
జర్మన్ బేకరీకి విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు. అది యూదుల ప్రార్థనా మందిరానికి, ఓషో ఆశ్రమానికి చాలా దగ్గరగా ఉంది. పేలుడు సంఘటన ప్రదేశాల చిత్రాలను మీడియా ప్రసారం చేయకూడదని ఉగ్రవాద నిరోధక కోర్టు ఆదేశించింది. వాటిని ప్రసారం చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని పోలీసులు అభిప్రాయపడడంతో కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.












