ఎసిబి అదుపులో జగన్ వర్గం నేత ప్రసన్న అనుచరుడు

శుక్రవారం, జనవరి  27, 2012, 10:29 [IST]
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎసిబి అధికారులు ఎక్సైజ్ అధికారులు, మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వరంగల్, కరీంనగర్, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం ఉదయం నుండి మెరుపు దాడులు ప్రారంభించారు. ఇవి శనివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశముంది. ఈ దాడుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడిని ఎసిబి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో టిడిపికి చెందిన ఓ మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో కూడా దాడులు చేస్తున్నారు. ఈ సిండికేట్‌లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని ఇప్పటికే తెలిసిన విషయం. గతంలో దాడులు చేసినప్పుడు వాటి ఆధారంగా లభించిన వివరాల మేరకు ఎసిబి మళ్లీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఒంగోలులో మద్యం వ్యాపారి వెంకట్రావ్ ఇంట్లో, సింగరాయకొండ ఎక్సైజ్ సిఐ గురువయ్య ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మొదటిసారి దాడులు జరిగినప్పుడే వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ ఎసిబి పూర్తి సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల ద్వారా మద్యం మాఫియాలో కొత్త కోణం బయటపడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు కొన్ని చోట్ల మద్యం వ్యాపారులకు కోట్లాది రూపాయలు వడ్డీలకు ఇస్తున్నారు. మద్యం పూర్తిగా అమ్మిన తర్వాత వారు వ్యాపారుల నుండి వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో మూడు కేసులు నమోదయ్యాయి. తక్కువ కాలంలోనే మళ్లీ దాడులు చేయడంతో సిండికేట్లలో దడ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఒకరి ఇంట్లో అధికారులు పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ దాడుల వ్యవహారం తనకు తెలియదని, ఇప్పుడు తెలుసుకున్నానని, తప్పు చేసిన వారిపై తప్పకుండా చర్యలుంటాయని మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు.
English summary
ACB searching liquor syndicate offices and excise offices today.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets