మా పరిధిలో లేదు: తెలంగాణపై తీర్మానానికి సిఎం 'నో'

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 13:12 [IST]
Kiran Kumar Reddy
హైదరాబాద్: సమావేశాలలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నో అన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాల్సిందిగా సిఎంను కోరారు. అయితే సిఎం మాత్రం దీనిపై నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ అంశం మన పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. దీంతో తీర్మానం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టాల్సిందేనని టిఆర్ఎస్ పట్టుపట్టింది. టిఆర్ఎస్‌కు భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు మద్దతు పలికాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండుసార్లు ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారని, అది కూడా కేంద్రం పరిధిలోనే ఉన్నప్పుడు తీర్మానం ఎలా చేశారని వారు సిఎంను ప్రశ్నించారు. అయినప్పటికీ సిఎం మాత్రం తీర్మానంపై నిస్సహాయత వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సమయంలో తెలంగాణపై మాట్లాడుకోవచ్చునని సిఎం బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ పార్టీ నేతలకు సూచించారు.

కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సభ్యులను కోరారు. బడ్జెట్ పద్దులపై చర్చించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశమై అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏఏ అంశాలపై చర్చ జరగాలో మళ్లీ సమావేశమై నిర్ణయించుకుంటారు. కాగా బిఏసి సమావేశం అనంతరం టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ టిఆర్ఎస్ఎల్పీలో సమావేశమయ్యాయి. ఆ పార్టీలు సమావేశాలలో తెలంగాణపై ఉమ్మడిగా ముందుకు వెళ్లనున్నాయి.

English summary
CM Kiran Kumar Reddy said no to Telangana resolution in this sessions. TRS, BJP and CPI asked CM to propose resolution in this sessions but CM refused.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets