ప్రసంగంలో తెలంగాణ ఏది?, అబద్దాలు చెప్పించారు: జెపి

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 11:07 [IST]
Jayaprakash Narayana
హైదరాబాద్: అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం కేవలం మొక్కుబడిగా సాగిందని లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం అన్నారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. దీనిపై జెపి అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. తన ప్రసంగంలో విద్యుత్ బ్రహ్మాండంగా ఉందని చెప్పారని, కానీ ఏ గ్రామంలో కూడా విద్యుత్ సరిగా లేదన్నారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ సరిగా అందని పరిస్థితి నెలకొందన్నారు. వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. దీనికో దశ దిశ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలలో కొంత విద్యుత్ కోతను నివారిస్తున్నారని అన్నారు. అయినా నగరాల్లో ఇప్పటికీ రోజుకు కొన్ని గంటలు విద్యుత్ కోత ఉంటుందన్నారు. ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పించి అవినీతిపై చర్చ లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. అవినీతి మంత్రులు, అధికారులపై ఏమీ మాట్లాడలేదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు దాచాలని చూసినా దాగవన్నారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

గవర్నర్ గాలి కబుర్లు చెప్పారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సిపిఎం చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపింది. కాగా గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేనందున తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసనగా ప్రసంగాన్ని బహిష్కరించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ తదితర పార్టీలు గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.

English summary
Loksatta president Jayaprakash Narayana blamed governor Narasimhan speech about power.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets