ఏమీ మాట్లాడలేకనే ప్రతిపక్షాల గొడవ: ముఖ్యమంత్రి

బుదవారం, ఫిబ్రవరి 15, 2012, 12:40 [IST]
Kiran Kumar Reddy
హైదరాబాద్: మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయని అనుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్యం సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలంగాణ తీర్మానంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుమట్టడంతో సభా కార్యక్రమాలు బుధవారం మూడోసారి స్తంభించాయి. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన సూచనలను ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. తాము అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, చర్చకు తాము భయపడడం లేదని, అయితే ఓ పద్ధతి ప్రకారం చర్చించుకుందామని, సభా సమయాన్ని వృధా చేయవద్దని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు తమకు తగిన సూచనలు చేయకపోతే, ఏమీ మాట్లాడకపోతే తమ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోగలుగుతామని ఆయన అన్నారు. సభ 31 రోజుల పాటు నడుస్తుందని, కావాలంటే ఎక్కువ సేపు సభను నడుపుకుందామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకు సభను సజావుగా నడుపుకుందామని ఆయన అన్నారు.

సభను సజావుగా నడుపుకుందామని, సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఎంతగా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. సభా మర్యాదలు పాటించాలని ఆయన సూచించారు. అంతకు ముందు మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని - గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను పూర్తి చేసిన తర్వాత అన్ని విషయాలపై చర్చలు చేద్దామని సూచించారు. తాము అన్ని విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మద్యం సిండికేట్లపై చర్చించేదుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ప్రతి దానికీ తాము సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు.
English summary
CM Kiran Kumar Reddy retaliated that opposition is not in a position to speak about his government.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets