హైదరాబాద్: తెలుగుదేశం మూర్ఖపు పార్టీ అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాంగ్రెసులో కన్నా తెలుగుదేశంలోనే ఎక్కువ అయోమయం ఉందని ఆయన అన్నారు. పార్టీ పోలిట్బ్యూరో, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై గతంలోనే తమ విధానం చెప్పామని అంటున్న తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు పార్టీలు తెలంగాణపై తమ వైఖరి చెప్పలేదని కేంద్ర హోం మంత్రి చిదంబరం అంటున్నారని, ఆ నాలుగు పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉందని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని, ప్రజా క్షేత్రంలోని తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పల్లెబాట కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. 29వ తేదీ వరకు ప్రతి గ్రామం తిరుగుతామని ఆయన చెప్పారు. తాము ఏది చేసినా తెలంగాణ సాధన కోసమేనని ఆయన అన్నారు.
ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలో తమ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆధ్వర్యంలో సభలుంటాయని ఆయన చెప్పారు. మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఈ సభలు జరుగుతాయని, మార్చి 10వ తేదీన నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో కెసిఆర్తో పాటు నాయకులంతా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో మార్చి 11న ఆదిలాబాదులో బహిరంగ సభ ఉంటుందని ఆయన చెప్పారు. మహబూబ్నగర్లో కేసిఆర్ మూడు రోజుల పాటు మకాం వేస్తారని ఆయన చెప్పారు.



















