భోజనం చేయని జగన్, ఇంటి వద్ద జగన్ ఫ్యామిలీ ధర్నా
విజయమ్మ కుటుంబ సభ్యులను ఇంటికి తరలించడానికి ముందు సాక్షి మీడియా సిఇవో సజ్జల రామకృష్ణా రెడ్డి, జగన్ మామ గంగిరెడ్డి, మరో బంధువు వైవి సుబ్బా రెడ్డిలను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర రావు, బాజిరెడ్డి గోవర్ధన్లను అక్కడి నుంచి తరలించారు. మొదట వైయస్ జగన్ భార్య భారతిని, ఆ తర్వాత వైయస్ విజయమ్మ, షర్మిళను అక్కడి నుంచి తరలించారు. తన కుమారుడిని తీసుకునే తాను ఇక్కడి నుంచి కదులుతానని వైయస్ విజయమ్మ అంతకు ముందు అన్నారు. పోలీసుల తీరుపై విజయమ్మ, షర్మిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక వాహనాల్లో వారందరినీ ఇంటికి తరలించారు.
మహిళా కమెండోలు కూడా పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనాలను రప్పించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైయస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ధర్నా విరమించుకోవాలని పోలీసులు వైయస్ విజయమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. విజయమ్మతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భార్య భారతి, సోదరి షర్మిళ రాజభవన్ సమీపంలోని దిల్కుషా అతిథి గృహం వద్ద ప్లాట్ఫారంపై బైఠాయించారు.
దిల్కుషా అతిథి గృహం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైయస్ విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని ఇంటి వద్ద కూడా నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. వారితో పాటు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయి రెడ్డి ఉన్నారు.