విజయమ్మకు షాక్: జగన్ అరెస్టుపై జోక్యానికి సిఇసి నో
ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరిగేందుకు తన కుమారుడిని విడుదల చేయాలని సిబిఐకి సూచించాలని కోరుతూ వైయస్ విజయమ్మ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎస్వై ఖురేషీకి సోమవారం ఓ లేఖ రాశారు. జూన్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరగాల్సిన స్థితిలో వైయస్ జగన్ను కుట్రపూరితంగా సిబిఐ అరెస్టు చేసిందని, పాలక కాంగ్రెసు పార్టీకి సహాయం చేసేందుకు జగన్ ఎన్నికలో ప్రచారంలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే ఈ అరెస్టు జరిగిందని ఆమె ఖురేషీకి రాసిన లేఖలో ఆరోపించారు.
ఉప ఎన్నికల పోలింగుకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండగా ఈ నెల 27వ తేదీన జగన్ను సిబిఐ అరెస్టు చేసిందని, ఈ విషయంలో సిఇసి జోక్యం చేసుకోవాలని కోరుతున్నానని ఆమె అన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ 270 రోజుల పాటు వైయస్ జగన్కు సమన్లు ఇవ్వకుండా ఉప ఎన్నికల తేదీలు దగ్గరపడిన సమయంలో ఇవ్వడంలోనే కుట్ర దాగి ఉందని ఆమె అన్నారు.
రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జూన్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 18 శానససభా స్థానాల్లోనూ లోకసభ స్థానంలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తోంది. సిబిఐ ముందు హాజరయ్యే వరకు వైయస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. సిబిఐ ముందు హాజరు కావడానికే ఆయన హైదరాబాదు వచ్చారు.