జగన్ పార్టీలోకి బొత్స జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే?
పార్వతీపురం శాసనసభ్యురాలు సవరపు జయమణి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం వస్తోంది. ఆమె రంగారావుతో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. నిజానికి శనివారంనాడు రంగారావుతో పాటు జయమణి హైదరాబాదు వచ్చి వైయస్ జగన్ను కలవాల్సి ఉంది. కానీ అర్థాంతరంగా ఆమె ఆగిపోయినట్లు చెబుతున్నారు. ఆమె బుధవారం రంగారావుతో చర్చలు జరిపినట్లు సమాచారం.
మరో శానససభ్యుడు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కురుపం శానససభ్యుడు జనార్దన్ కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలను అరికట్టడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వైయస్ జగన్ను సిబిఐ విచారణకు పిలిచినప్పటి నుంచి వలసలకు సంబంధించిన ప్రచారం సాగుతోంది. దాదాపు 35 మంది శాసనసభ్యులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వల వేసినట్లు వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు 30 మంది శాసనసభ్యులను సంప్రదించారనే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఒక సందర్భంలో చెప్పారు.