లండన్: లండన్ 2012 ఒలింపిక్స్లో భారత్ ఐదో పతకం తన ఖాతాలో వేసుకుంది. హర్యానా రాష్ట్రానికి చెందిన యోగేశ్వర్ దత్ రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించారు. బీజింగ్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ను దురదృష్టం వెంటాడినప్పటికీ ఈసారి మాత్రం సాధించాడు. యోగేశ్వర్ కాంస్యంతో భారతీయులకు ఆనందం కలిగించాడు. పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో అతను కాంస్యాన్ని సాధించాడు.
శనివారం జరిగిన కాంస్య పతక పోరులో యోగేశ్వర్ 3-1తో ఉత్తర కొరియాకు చెందిన జాంగ్ మాంగ్ పైన ఘన విజయం సాధించాడు. తొలి రౌండ్లో 0-1తో వెనుకబడిన యోగేశ్వర్ ఆ తర్వాత రెండో రౌండ్లో 1-0తో ఉండి పథకంపై ఆశలు సజీవంగా నిలిపాడు. కీలక మూడో రౌండ్లో ఒక్కసారిగా రెచ్చిపోయిన యోగేశ్వర్ కొరియా బాక్సర్ని పట్టు దొరబుచ్చుకొని కుప్పకూల్చాడు. పల్టీల మీద పల్టీలు కొట్టించి చివరి రౌండ్ను నిమిషంలో ముగించి ఏకంగా ఆరు పాయింట్లు సాధించాడు. దీంతో కాంస్యం సాధించి భారత్ ఖాతాలే వేశాడు.
మరో ముఖ్య విషయమేమంటే యోగేశ్వర్ శనివారం కేవలం ఐదున్నర గంటలలోనే ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు నెగ్గాడు. యోగేశ్వర్ ఫ్రీక్వార్టర్స్లో ఓడినప్పటికీ రెపిచేజ్లో రెచ్చిపోయి.. వరుసగా మూడు మ్యాచ్లలో విజయకేతనం ఎగరవేయడం కాంస్యం గెలుచుకునేందుకు దోహదపడింది. ఈ పతకం గెలవడం ద్వారా అతను తన తండ్రి కోరికను నెరవేర్చాడు.



















