ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య ఇక లేరు
రాజయ్య 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలు పార్లమెంటు హౌస్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడమీల్లో ప్రదర్శనకు ఉంచారు ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కాపు రాజయ్య మెదక్ జిల్లా సిద్ధిపేటలో 1925 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన చిత్రకళలో డిప్లమా పొందారు. డ్రాయింగ్లో మద్రాసు ప్రభుత్వ డిప్లమా కూడా పొందారు లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది.
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఆయన తండ్రి రాఘవులు సిద్ధిపేటలో చిన్నపాటి వ్యాపారి. రాఘవులుకు ఆయన మూడో సంతానం. ఆయనకు ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కాపు రాజయ్య కుటుంబాన్ని తండ్రి మిత్రుడు మార్క చంద్రయ్య ఆదుకున్నారు. ఆరో స్టాండర్డులో ఉన్నప్పుడు ఆయన మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు.
రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఆయన తన పుట్టిన గడ్డను మరిచిపోలేదు. ఆయన సిద్ధిపేటలో సైకిల్పై తిరుగుతూ ఉండేవారు.
రాజయ్య తొలి చిత్రాలు సంప్రదాయబద్దమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో, అంటే వాష్ పద్ధతిలో చిత్రాలు వేశారు. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయను ముగ్ధుడ్ని చేసింది. దాంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. నకాషీ చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఇరవై ఏళ్ల పాటు 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు.